Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా నిరసన కేంద్రంపైనే
- పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఈనెల 20వ తేదీ నుంచి జరిగే దేశవ్యాప్త లారీల సమ్మెను జయప్రదం చేయాలని పలు సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సోమవారంనాడిక్కడ జరిగింది. అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్ భాస్కరరెడ్డి, దుర్గాప్రసాద్, దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘాల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు గోపాలనాయుడు, షణ్ముగప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. రోజువారీ ధరల నిర్ణయం వల్ల లారీ యజమానులపై ఆర్ధికభారాలు పెరుగుతున్నాయని చెప్పారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన మోటారు వాహనచట్టం సవరణల బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. థర్డ్పార్టీ ఇన్సూరెన్స్ రేట్లను భారీగా పెంచేసి, లారీ యజమానుల జేబులు కొల్లగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టోల్ఫీజుల్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్తో సింగిల్పర్మిట్ విధానాన్ని ఖరారు చేయాలని, టోల్టాక్స్ను ఎత్తివేయాలని, లారీల్లో ఓవర్లోడింగ్కు యజమానులనే బాధ్యుల్ని చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు లారీల సమ్మెను విరమించేదిలేదని స్పష్టంచేశారు.
రవాణామంత్రికి వినతి
లారీ యజమానుల సమస్యలు పరిష్కరిం చడంలో చొరవ చూపాలని కోరుతూ తెలంగాణ లారీ ఓనర్స్ వేల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం సోమవారం రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డికి వినతిపత్రం సమర్పించింది. ఆ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు బీ నందారెడ్డి, బాల్రెడ్డి, రామ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొండల్రెడ్డి తదితరులు సచివాలయంలో మంత్రిని కలిశారు. పై డిమాండ్లతో పాటు అన్ని జిల్లాల్లో డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.