Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కడియంకు ఎస్ఎఫ్ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిం చాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని సోమవారం హైదరాబాద్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మాదం తిరుపతి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. యూజీసీని రద్దు చేయాలన్న నిర్ణ యాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపాలని ఓ ప్రకటనలో తెలిపారు. యూజీసీ రద్దు వల్ల విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి దెబ్బ తింటుందని పేర్కొన్నారు. బ్యూరోక్రాట్ల చేతుల్లోకి అధికారం వెళ్తే విద్య మరింత వ్యాపారమయంగా మారుతుందని తెలిపారు. రాజకీయ జోక్యం లేకుండా కొనసాగుతున్న యూజీసీ రద్దు వల్ల ఉన్నత విద్యలో పాలకుల జోక్యం పెరుగుతుందని పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని తెలిపారు. హెకీ వల్ల ఉన్నత విద్య పూర్తిగా కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళ్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నచ్చిన విశ్వవిద్యాలయాలు, కోర్సులకే కేటాయింపులు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు మరింత నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. కడియం శ్రీహరిని కలిసిన వారిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, నగర అధ్యక్షుడు ఎం అశోక్రెడ్డి, నాయకులు ప్రేమ్, రవి, మల్లేష్, శ్రీకాంత్, ఏసుబాబు, పవన్ తదితరులున్నారు.