Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీ కార్యదర్శి ఎదుట కాంగ్రెస్ నేతల బాహాబాహీ
- ఉత్తమ్, కోమటిరెడ్డి గ్రూపుల ఘర్షణ
- కుర్చీలు విసురుకొని గందరగోళం సృష్టించిన కార్యకర్తలు
- భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశంలో రసాభాస
నవతెలంగాణ- యాదాద్రిభువనగిరి ప్రతినిధి
ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ ఎదుటే కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఉత్తమ్, కోమటిరెడ్డి గ్రూపుల మధ్య ఘర్షణ జరిగి పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఒకరి చొక్కాలు మరొకరు చించుకుని వీరంగం సృష్టించారు. దీంతో సోమవారం జరిగిన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం ఉద్రిక్తంగా మారింది. గొడవను సద్దుమణిగించేందుకు 'బిల్కుల్ చుప్రహో' అంటూ పరిశీలకుడు పలుమార్లు తీవ్రస్థాయిలో మందలించినా కార్యకర్తలెవరూ ఖాతరు చేయలేదు.
యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని జయలక్ష్మి గార్డెన్స్లో కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమీక్షా సమా వేశం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ రాజగోపాల్రెడ్డి, పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు.
నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షలో కోమటిరెడ్డి అనుచ రుడు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఉత్తమ్ అనుచరులు కొండేటి మల్లయ్య, ప్రసన్నరాజ్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. 'టీఆర్ఎస్లోకి వెళ్లి ఇటీవల పార్టీలోకి వచ్చిన మల్లయ్యను సమావేశానికి ఎట్టా పిలుస్తారు. టికెట్ కావాలని ఏ ప్రాతిపదికన కోరుతాడు. మల్లయ్య టీఆర్ఎస్ ఏజెంట్, గుత్తా సుఖేందర్రెడ్డి కోవ ర్టంటూ' అంటూ లింగయ్య అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఇరు గ్రూపుల వాగ్వాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. నకిరేక ల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గత ఎన్నికల్లో ఓడిపో యారు. మళ్లీ ఆయనకే టికెట్ ఇవ్వాలని మద్దతుదారులు నినాదాలు చేశారు. మరోవైపు ఉత్తమ్ గ్రూపుకు చెందిన ప్రసన్నరాజ్కు టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు నినాదించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది.
భువనగిరి నియోజకవర్గం సమావేశంలో ఇన్చార్జి కుంభం అనిల్కుమార్రెడ్డి అనుచరుడు చెరుకు అచ్చయ్యగౌడ్, కోమటిరెడ్డి అనుచరుడు శ్యాంగౌడ్ మధ్యన బూత్ కమిటీల విషయంలో వివాదం తలెత్తింది. 'మండల పార్టీ అధ్యక్షుడినైన నాకు తెలి యకుండా కుంభం అనుచరులు కమిటీలు ఏకపక్షంగా వేశారని' శ్యాంగౌడ్ పరిశీలకుడికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇరు గ్రూపుల మధ్య వాగ్వాదం తోపులాడుకున్నారు. పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మల్లు రవి, పొన్నాల లక్ష్మయ్య వారికి సర్దిచెప్పారు. మునుగోడుకు సంబంధించి నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి స్రవంతి మాట్లాడుతుండగా, కోమటిరెడ్డి జిందాబాద్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేయడంతో గొడవ ప్రారంభమైంది. అదే క్రమంలో మునుగోడులో పాల్వాయి స్రవంతికి టికెట్ ఇవ్వాలంటూ మరికొందరు కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో ఇరువురి నినాదాలతో గొడవ తీవ్ర రూపం దాల్చింది. వీటన్నింటితో నాయకులు సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు.