Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీహెచ్సీలను వేధిస్తున్న డాక్టర్ల కొరత
- ఓపీలో 50 శాతం మందికే వైద్యసేవలు
- రోగులను పరిశీలిస్తున్న సిబ్బంది
- ఏజెన్సీ ప్రాంతాల్లో నామమాత్రంగా వైద్యసేవలు
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నపల్లికి
చెందిన పద్మ పురిటి నొప్పులతో స్థానిక పీహెచ్సీలో రెండ్రోజుల క్రితమే చేరింది. ఇద్దరు డాక్టర్లు లేకపోవడంతో స్టాఫ్ నర్సే ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీసింది. పుట్టిన మగబిడ్డ అక్కడే మృతిచెందాడు. తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలో దళితుడైన కడారి శ్రీనివాస్ హమాలీ కార్మికుడు. గత నెల 12న గుండెపోటుకు గురవడంతో పీహెచ్సీకి తరలించారు. వైద్యుల్లేకపోవడంతో నర్సులు పరీక్షించి జనగామ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. సకాలంలో వైద్యమందక శ్రీనివాస్ మృతిచెందాడు. పీహెచ్సీలో రెండు నెలలుగా వైద్యుల్లేకపోవడం గమనార్హం.
నవతెలంగాణ-మొఫిసిల్ యంత్రాంగం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరతకు పైరెండు ఉదాహరణలు అద్దంపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీల్లో ప్రతియేడు మాదిరిగానే డాక్టర్ల కొరత వేధిస్తున్నది. దీంతో పేద, మధ్య తరగతికి చెందిన కుటుంబాలకు వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతున్నది. సరైన వైద్యమందక.. సకాలంలో పెద్దాస్పత్రులకు వెళ్లలేక ఏజెన్సీల్లో పలువురు మృతిచెందిన ఘటనలూ ఉన్నాయి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో రెండు నెలలుగా వైద్యుల్లేరు. అక్కడ రెండు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మెదక్ జిల్లాల్లో ఆరు పీహెచ్సీల్లో మొత్తానికే వైద్యుల్లేని పరిస్థితి. దీంతో రోగులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయి స్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆదిలాబాద్, కొమురం భీం, మహబూబాబాద్ జిల్లాలో వర్షాకాలంలో రోగుల సంఖ్య పెరుగుతున్నా మెరుగైన చర్యలు చేపట్టడం లేదు. సగం మంది రోగులకే వైద్యం
సీజనల్ కాలంలో రోగుల తాకిడి పెరుగుతున్నా అత్యధిక సెంటర్లలో వైద్యులు అందబాటులో ఉండటం లేదు. నల్లగొండలో 18, కరీంనగర్లో 6 పీహెచ్సీలు 24 గంటల వైద్య సేవలందిస్తున్నప్పటికీ రాత్రి సమయాల్లో వైద్యుల్లేక నర్సులే చికిత్స చేస్తున్నారు. రెగ్యులర్ వైద్యుల నియమకాల్లేక అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ఆదిలాబాద్, కొమురంభీం, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లోని ఏజెన్సీల్లో రోజుకు 30 నుండి 50 మంది రోగులు వస్తున్నా సిబ్బంది కొరత వల్ల సగం మందికి మాత్రమే వైద్యం చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవల్లో వైద్యులకు బదులు పారామెడికల్ సిబ్బందే రోగులను పరిశీలించి మందులిస్తున్నారు. షిఫ్టులవారీగా స్టాఫ్ నర్సులే అన్ని సేవలందిస్తున్నారు. గత నెల 11న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు పీహెచ్సీలో సిబ్బంది లేకపోవడంతో పద్మ అనే గర్భిణి అక్కడికక్కడే పురుడుపోసుకుంది. ఏజెన్సీలోని బెజ్జూర్, జైనూర్, సిర్పూర్ (యు) మండలాల్లో రెగ్యులర్ డాక్టర్లే లేక రోగులు ఇక్కట్లు పడుతున్నారు.
నవతెలంగాణ పరిశీలనలో ఇదీ పరిస్థితి
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ పీహెచ్సీ పరిధిలో మొత్తం 46 గ్రామాలు. ఇద్దరు వైద్యులకుగాను కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. పీహెచ్సీలో హెచ్ఈ, హెచ్ఈఓ, రెండు సీహెచ్ఓ, రెండు సూపర్ వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శిబిరాలు నిర్వహించే సమయంలో వైద్యులు బయటికెళ్తే ఇక్కడ ఎవరూ ఉండరు. ధనోర, అందర్బంద్, కరంజి(టి), అర్లి(టి) గిరిగామ్, భీంపూర్లో వాటిని తెరవడంలో ఆలస్యం జరుగుతోంది.
నల్లగొండ జిల్లాలో సాయంత్రమైందంటే వైద్యులు ఉండటం లేదు. వర్షాకాలంలో పాము, తేలు కాటుతో బాధపడి వెళ్లిన వాళ్లను వాక్సిన్ లేవని పెద్దాస్పత్రులకు పంపుతున్నారు. రామన్నపేట మునిపంపుల పీహెచ్సీలో ఇన్చార్జి డాక్టర్ చార్జీ తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు రాలేదు. మిగతావారు సైతం వారంలో మూడ్రోజులు గైర్హాజరవుతారని రోగులు ఆరోపిస్తున్నారు.
ఆలేరు మండలంలోని షారాజిపేట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ జ్యోతిబాయి గత 10 రోజులుగా సెలవులో ఉన్నారు. సుమారు 20మందికి పైగా అవుట్ పేషెంట్ రోగులురాగా ఫార్మాసిస్టు వెంకటేశ్వర్లు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. గత రెండు నెలల నుంచి ఇక్కడ సాధరణ ప్రసూతి చేయకుండా జనగామకు రెఫర్ చేస్తున్నారు. బీబీనగర్ మండల కేంద్రంలోని ఆరు పడకల ఆస్పత్రిలో మధ్యాహ్నం పరిశీలించగా 28 మంది సిబ్బందికిగాను ఆరోగ్యమిత్ర, సెకండ్ ఏఎన్ఎం మాత్రమే ఉన్నారు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు పీహెచ్సీలో రోజుకు 40 నుండి 60 మంది పేషెంట్లు వస్తున్నారు. నెలకు 4 నుండి 6 వరకు ప్రసవాలు జరుగుతున్నా వైద్యులు లేరు. గతంలో ఉన్న వైద్యుడు రాజీనామా చేసి వెళ్లారు. ఇన్చార్జి వైద్యుడు కూడా పీహెచ్డీ చేసేందుకు నెలరోజుల క్రితం సెలవు పెట్టి వరంగల్కు వెళ్లడంతో వైద్యం కోసం పెద్దపల్లికి వెళ్తున్నారు. భూపాలపల్లి మండలం ఆజాంనగర్లో ఆరోగ్య ఉపకేంద్రానికి ఏఎన్ఎం మాత్రమే దిక్కు. అడవికి సమీపంలో ఉన్న ఈ గ్రామంలో జబ్బొస్తే ఇబ్బందే.
నిర్మల్ జిల్లా భైంసామండలంలోని మహగాంలోని పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉండగా రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కుభీర్ పీహెచ్సీకి చెందిన వైద్యుడు సుధీర్కుమార్ ఇక్కడ ఇన్చార్జి వైద్యుడు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకే వైద్యసేవలందుతున్నాయి. నాలుగేండ్లుగా ఇక్కడ సరైన చికిత్స లేదని, ఇన్చార్జి వైద్యుడు సైతం ఎప్పుడొస్తారో.. ఎప్పుడెళ్తారో తెలియక వేరే దవాఖానాలకు పోతున్నామని రోగులు చెబుతున్నారు.
పెద్దాస్పత్రికి వెళ్లక తప్పట్లేదు : సుధగోని శ్రీనివాస్, కొత్తగట్టు గ్రామం (కరీంనగర్)
గతంలో విధులు నిర్వహించిన డాక్టరు ఆస్పత్రికి రాలేదు. ఆయన బదిలీపై వెళ్లడంతో ప్రస్తుతం హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్కు ఇన్చార్జి ఇచ్చారు. ఇబ్బంది ఎదురువుతోంది. పూర్తిస్థాయి డాక్టర్ను నియమించాలి. రోగం ఎక్కువైతై కరీంనగర్ పెద్ద ఆస్పత్రికి వెళ్లక తప్పని పరిస్థితి.
నర్సులే చూస్తున్నరు : జమ్ములమ్మ, నడింపల్లి (నాగర్కర్నూల్)
వారం రోజులుగా వస్తున్నా నర్సులే చూస్తున్నారు. వైద్యులు కనిపించడం లేదు. రోజురోజుకూ ఆయాసం పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక్కడ రోగులందరికీ సరిగ్గా మందులు కూడా అందడం లేదు.
పట్టణాలకు పరుగులు : పల్లెపు యాదయ్య, నంగునూరు, సిద్దిపేట
పేరుకే పెద్దాస్పత్రులు ఉన్నాయి తప్పా అందులో సిబ్బంది లేరు. అత్యవసర పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాలకు పరుగెడుతున్నం. ప్రభుత్వం చెబుతున్న సేవలు ఎక్కడా అమలు కావడం లేదు. నంగునూరు పీహెచ్సీని సీహెచ్సీగా మార్చారు తప్పా వైద్యుల్ని నియమించలేదు.
ఏజెన్సీ ప్రాంతాల్లో అప్రమత్తం చేశాం : ఏ కొండలరావు, డీఎంహెచ్వో ఖమ్మం
ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించాలని వైద్యారోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పలుమార్లు అవగాహన సదస్సులు నిర్వహించాం. వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాం.
ప్రతిపాదనలు పంపించాం : రాజీవ్ రాజ్, డీఎంహెచ్వో ఆదిలాబాద్
పీహెచ్సీల్లో వైద్యుల ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు పంపించాం. మరో రెండు నుంచి మూడు వారాల్లో సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. సీజనల్ వ్యాధులు ప్రబలే చోట ముందస్తుగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. వ్యాధులు ఎక్కువగా వ్యాప్తించెందే ఏరియాల్లో ఇద్దరేసి వైద్యులను నియమించాం.
సమయం పాటించకుంటే చర్యలు : అమర్సింగ్నాయక్, డీఎంహెచ్వో, సిద్దిపేట
ఖాళీలను గుర్తించి దశలవారీగా భర్తీచేస్తున్నాం. అసంక్రమిత వ్యాధుల గుర్తింపు కోసం జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో కొంత మంది సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తున్నారు పీహెచ్సీల్లో సమయాన్ని పాటించని వైద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం.
జిల్లా పీహెచ్సీలు వైద్యుల ఖాళీలు
భూపాలపల్లి 25 8
మహబూబాబాద్ 18 21
జనగామ 13 12
వరంగల్ అర్బన్ 11 12
వరంగల్రూరల్ 17 13
ఖమ్మం 22 07
భద్రాద్రి కొత్తగూడెం 29 -
యాదాద్రి భువనగిరి 19 06
నల్లగొండ 32 09
నిజామాబాద్ 32 08
కామారెడ్డి 18 11
కరీంనగర్ 16 10
రాజన్నసిరిసిల్ల 13 -
పెద్దపల్లి 15 08
జగిత్యాల 17 -
కుమురంభీం 18 24
నిర్మల్ 17 02
ఆదిలాబాద్ 27 12
రంగారెడ్డి 48 16
సంగారెడ్డి 30 11
సిద్ధిపేట 33 18
మెదక్ 20 13
వికారాబాద్ 21 04
మహబూబ్నగర్ 28 16
నాగర్కర్నూల్ 24 21
జోగులాంబగద్వాల 09 09
వనపర్తి 12 08