Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మారేందుకు అవకాశమివ్వండి
- ఉన్నత విద్యామండలికి కొందరు డిగ్రీ విద్యార్థుల విజ్ఞప్తి
- చేరిన విద్యార్థులకు మారే అవకాశం లేదు
- సీటు రాని వారి కోసమే ప్రత్యేక విడత : పాపిరెడ్డి, లింబాద్రి
- నేడు దోస్త్ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఈ కాలేజీ మాకొద్దు. కాలేజీ మార్చుకునేందుకు అవకాశం కల్పించాలి. కావాలంటే ఆ కాలేజీ నుంచి సీటు రద్దు చేసుకుంటాం. కొత్తగా వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వాలి.'అని కొందరు విద్యార్థులు ఉన్నత విద్యామండలి అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఓటీపీ కాలేజీలో ఇవ్వకపోయినా సీటు వచ్చిందని కొందరు, ప్రయివేటు కాలేజీలో ఫీజులు ఎక్కువున్నాయని, ప్రభుత్వ కాలేజీలో చదివేందుకు అవకాశమివ్వాలని ఇంకొందరు, హైదరాబాద్లో చదువుతానని మారేందుకు అవకాశం కల్పించాలని మరికొందరు, సీటు రద్దు చేసుకొని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీలో చదువుతామని ఇలా చాలా మంది విద్యార్థులు కాలేజీ మారేందుకు అవకాశం కల్పించాలని ఉన్నత విద్యామండలి, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో కాలేజీయేట్ కమిషనర్ నవీన్మిట్టల్, దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి ఈ అంశాలపై చర్చించారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, లింబాద్రి సమాలోచన చేశారు. మీడియాతో పాపిరెడ్డి, లింబాద్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కోసం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఇప్పటికీ సీటు రాని వారికి, సీటు కేటాయించినా కాలేజీలో చేరని వారి కోసమే ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు నష్టపోకూడదనే ఈ అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. తాము స్టూడెంట్ ఫ్రెండ్లీ విధానం పాటిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ప్రవేశం పొందిన విద్యార్థులు కాలేజీ మారేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఓటీపీ ఇవ్వకపోయినా ప్రవేశం కల్పించిన విద్యార్థులుంటే అలాంటి వారి సమస్యను ప్రత్యేకంగా పరిగణిస్తామని చెప్పారు. 25 మందిలోపు విద్యార్థులు చేరిన కోర్సులుంటే ఆయా కాలేజీ యాజమాన్యాలు నడపలేమని, ఆ విద్యార్థులు చదవలేమని తమ దృష్టికి తెస్తే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రత్యేక విడత కౌన్సెలింగ్లో 1,500 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. శుక్రవారం దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్లో భాగంగా సీట్లు కేటాయిస్తామన్నారు. శనివారం నాటికి కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని అన్నారు. ఉన్నత విద్యామండలి వద్ద ఉన్న విద్యార్థులతో లింబాద్రి మాట్లాడారు. విద్యార్థులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.