Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు ప్రతిపక్షనేత జానారెడ్డి ప్రశ్న
- కోమటిరెడ్డి, సంపత్లపై అనర్హత వేటు ఎత్తివేయాలని డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ల అనర్హతపై హైకోర్టు విచారించి తుదకు స్పీకర్కు నోటీస్ ఇచ్చినా స్పందించరా? అంటూ ప్రతిపక్షనేత కె జానారెడ్డి సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అనర్హతపై కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పద్ధతి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను దిగజారుస్తుందన్నారు. కోర్టు తీర్పును గౌరవించి వెంటనే ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎత్తివేయాలని సూచించారు. కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను పక్కనబెట్టి, రాజ్యాంగ ప్రతిష్ట పెరిగేలా వ్యవహరించాలన్నారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేల స్థానాలను పునరుద్ధరించాలని, వారికి జీతభత్యాలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఈ అంశాన్ని ఇంకా సాగదీయడం మంచిదికాదన్నారు. కుసంస్కారంతో మాట్లాడే వ్యక్తులపై తాను మాట్లాడదల్చుకోలేదని పరోక్షంగా కేటీఆర్నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అందరూ...అన్ని పార్టీలు సిద్దంగా ఉంటాయన్నారు. ఐదేండ్లు ఉండాల్సిన ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతుందో, ఆ పరిస్థితులకు గల కారణాలను ప్రజలకు సీఎం చెప్పాలన్నారు. జమిలిలో భాగంగా పార్లమెంటు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలకు పోతే మంచిదేనన్నారు. అసెంబ్లీకి మాత్రమే ముందస్తు ఎన్నికలు వస్తే ప్రజలపై అనవసరమైన ఆర్ధిక భారం పడుతుందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అవసరమైతే ఇంకో ఆరు నెలల తర్వాత ఎన్నికలకు వెళ్ళొచ్చుగా అని సూచించారు. హామీలు అమలు చేయకుండా ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతారని ప్రశ్నించారు. తాను ఉన్నంత కాలం పార్టీ పక్షాననే ప్రజలకు సేవచేస్తామన్నారు. తాను ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది పార్టీయే నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు హర్షించేలా తమ పార్టీ పొత్తులు పెట్టుకుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
కేటీఆర్కు బూతు చక్ర అవార్డు ఇస్తా : వీహెచ్
కాంగ్రెస్ పార్టీపై తిట్ట దండకాన్ని అందుకుంటున్న మంత్రి కేటీఆర్కు బూతు చక్ర అవార్డు ఇస్తానని మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్పారు. బూతు పురాణంలో కేటీఆర్ నెంబర్వన్గా నిలిచారని, వచ్చే నెలలో ఆయనకు రవీంద్రభారతి వేదికగా బూతు సాహిత్య అవార్డు కూడా ప్రదానం చేయడంతోపాటు రూ 116 నగదు బహుమతి కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. గురువారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్కు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ముఖ్య అతిధిగా పిలుస్తానన్నారు.