Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ల ఎదుట గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నాలు
- మేడ్చల్, రంగారెడ్డి కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం
- పలు జిల్లాల్లో వర్షంలోనూ కొనసాగిన ఆందోళన
నవతెలంగాణ-యంత్రాంగం
జీతం పెంచేదాకా...సమస్యలు పరిష్కరించేదాకా... తమ ఆందోళన ఆగబోదంటూ గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అడుగడుగునా ఆటంకం సృష్టిస్తున్నా...పోలీసులు అరెస్టులు చేస్తున్నా తమ పోరు సలుపుతూనే ఉన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయండా తడుస్తూనే జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట జీపీ కార్మికులు గురువారం ధర్నాలు చేపట్టారు. మేడ్చల్, రంగారెడ్డి కలెక్టరేట్ల ముట్టడిలో కార్మికులను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేసే క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ఓ మహిళా కార్మికురాలు స్పృహ తప్పిపడిపోయింది.
మేడ్చల్ కలెక్టరేట్ను వెయ్యిమందికిపైగా జీపీ కార్మికులు ముట్టడించారు. కలెక్టర్కు సమస్యలు విన్నవిస్తామని కార్మికులు పోలీసులను వేడుకున్నారు. కానీ, పోలీసులు అనుమతించలేదు. పైగా, కార్మికులు లోనికెళ్లకుండా ముండ్ల కంచె వేశారు. కార్మికులు దానిని దాటి లోనికెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. అయినా, కార్మికులు లోనికి చొచ్చుకెళ్లారు. అప్పుడే వచ్చిన కలెక్టర్ వాహనాన్ని ప్రధాన ద్వారం వద్ద అడ్డుకున్నారు. స్పందించిన కలెక్టర్ నాయకులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీనివ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనకు సీపీఐ(ఎం), సీపీఐ, ఏఐటీయూసీ, టీఆర్ఎస్కేవీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీపీ కార్మిక సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ...టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ జీపీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతోందని విమర్శించారు. జీపీ కార్మికులకు నెలకు రూ.8500వేతనమిస్తామని చెప్పి ఏ నిధుల నుంచి ఎంత శాతం ఇస్తారనే దానిపై నిర్ధిష్టంగా లేకుండా సీఎం ఆదేశాలు జారీ చేశారని అన్నారు. జీఓ నెం.112, 212లను సవరించాలన్నారు. కర్నాటక తరహాలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. జనాభా ప్రతిపాదికన గ్రామాలకు పోస్టులు మంజూరు చేసి ప్రస్తుతం పనిచేస్తున్న వారిని భర్తీ చేయాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, పింఛన్ సౌకర్యాలు కల్పించాలన్నారు. జనశ్రీ బీమా బదులు రూ.5లక్షలు ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి సత్యం తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట జీపీ కార్మికులు చేపట్టిన ధ ర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. ధర్నా సమాచారంతో ముం దుగానే పోలీసులు కలెక్టరేట్ గేట్లను మూసేశారు. దీంతో గేటు ఎదుట కార్మికులు బైటాయించారు. వారిని అరెస్టు చేసే క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఓ మహిళా కార్మికురాలు స్పృహ తప్పి పడిపోయింది. మరో కార్మికునికి గాయాలయ్యాయి. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.సత్యనారాయణరెడ్డి, కారోబార్ల సంఘం జిల్లా అధ్యక్షులు ఎమ్డీ మోయినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి తరలివచ్చారు. కలెక్టరేట్ ఉద్యోగుల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు వచ్చి వారిని నివారించారు. అనంతరం పాలడుగు భాస్కర్, కార్మికుల ప్రతినిధులు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. నల్లగొండలో అంబేద్కర్ భవన్నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
సూర్యాపేట కలెక్టరేట్లోకి కార్మికులు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నారు. వినతి పత్రం అందజేసేందుకు కొందరికి అనుమతి ఇచ్చారు. భద్రా ది కొత్తగూడెం జిల్లాలోనూ పంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వర కు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. జనగామలో అఖిలపక్షం నాయకులు చలో కలెక్టరేట్ నిర్వహించారు. ఏవో విశ్వప్ర సాద్కు వినతిపత్రాన్ని అందజేశారు. జయశంకర్ భూపాల పల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. హన్మకొండ ఏకశిలా పార్కు నుంచి కలెక్టరేట్ ముట్టడికి జీపీ కార్మికులు బయలు దేరగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఏకశిలా పార్కులో సభ నిర్వహించారు.
సంగారెడ్డిలో కేవల్ కిషన్ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. మెదక్ అర్బన్లో కార్మికులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్నగర్లో 500 మంది కార్మికులు ర్యాలీగా కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. వనపర్తిలో డీపీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. జగిత్యాల కలెక్టరేట్లో వినతిపత్రాన్ని తీసుకోవడానికి అధికారులు రాకపోవటంతో గేటుకు వినతిపత్రం పెట్టారు. రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, మంచిర్యాల కలెక్టరేట్లను ముట్టడించారు.