Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకుర్తి, వర్ధన్నపేటలో ఒంటరిగా పోటీ:
కేంద్ర కమిటీ సభ్యులు ఎన్.మూర్తి వెల్లడి
నవతెలంగాణ- జనగామ ప్రతినిధి
రానున్న ఎన్నికల్లో బీఎల్ఎఫ్కు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్.మూర్తి ప్రకటించారు. రాష్ట్రంలో పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో మాత్రమే తాము ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. మిగతా చోట్ల బీఎల్ఎఫ్కు మద్దతిస్తామన్నారు. గురువారం జనగామ ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకర్ల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి డి.రాజేష్తో కలిసి మూర్తి మాట్లాడారు. 2019లో పార్లమెంట్తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పసిగట్టి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోతున్నారని విమర్శించారు. బీజేపీతో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారన్నారు. బయటకు ఇద్దరు తగువులాడుకుంటున్నా వారి అంతిమ లక్ష్యం ఒక్కటే అన్నారు. బీజేపీది దుర్మార్గ, ఫాసిస్టు పాలన అని విమర్శించారు. రాష్ట్రంలో మిర్యాలగూడ, హైదరాబాద్ జరిగిన కులదురహంకార ఘటనల్ని చూస్తే కుల రక్కసిని పాలకులే ఉసిగొల్పుతున్నట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని విమర్శించారు. జేెఎన్యూలో ఎన్నికలు జరగకుండా ఏబీవీపీ దాడులు చేయడంతోపాటు మూర్ఖత్వంగా వ్యవహరించిందని అన్నారు. అదే యూనివర్సిటీలో చదివిన మంత్రి నిర్మలా సీతారామన్ సంఘ విద్రోహ, జాతి వ్యతిరేక శక్తులు చొరబడ్డాయని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులపై మూక దాడులతో పాటు హత్యలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోనూ కేసీఆర్ విద్రోహ పాలన నడుస్తోందన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి సైతం స్వచ్ఛమైన పాలన అందిస్తుందన్న నమ్మకం లేదన్నారు. అందుకే సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఎన్నికల్లో బీఎల్ఎఫ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు.
పాలకుర్తి అభ్యర్ధిగా రమేష్ రాజా
రాష్ట్రంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా పాలకుర్తి నుంచి రమేష్రాజాను అభ్యర్థిగా నిర్ణయించినట్టు మూర్తి తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్రమైన పాలకుర్తిలో తమ అభ్యర్థికి ప్రజల మద్దతు ఉంటుందన్న నమ్మకం ఉందన్నారు. ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి స్ఫూర్తిగా సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ అభ్యర్థి రమేష్రాజాను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ రాజా, నాయకులు సోమన్న, బుజేందర్, సంపత్ పాల్గొన్నారు.