Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోనియమ్మను బొమ్మ అన్న కేటీఆర్కు ప్రజలే బుద్ధి చెప్పాలి
- టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ భట్టి విక్రమార్క
- టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు : విజయశాంతి
- విద్యార్థులను రెచ్చగొడుతున్న ఆపద్ధర్మ సీఎం : కో చైర్పర్సన్ డి.కె అరుణ
నవతెలంగాణ - కొత్తకోట
ఐదేండ్లు పాలించుమని ప్రజలు ఓట్లేసి రాష్ట్రాన్ని చేతిలో పెడితే పరిపాలన చేతగాక 9 నెలల ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధమయ్యారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనిమమ్మను బొమ్మ అన్న కేటీఆర్కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట పురపాలక కేంద్రంలో బుధవారం నియోజకవర్గ ఇన్చార్జి డోకూర్ పవన్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు షో జరిగింది. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు విజయశాంతి, డికె అరుణ పాల్గొన్నారు. బట్టి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో విద్యా ర్థులు, వివిధ పార్టీల కార్యకర్తలు ఆత్మ బలిదానాలు చేసుకు న్నారని, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నాయకులు సోనియగాంధీ కాళ్లు మొక్కిన ఘటనలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నీళ్లు, నిధులు, ప్రాజె క్టుల కోసం ఆత్మగౌరవంతో పోరాటం చేస్తే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. కానీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రం ఏర్పడితే ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశించిన ప్రజలను కేసీఆర్ కుటుంబం మోసం చేసిందన్నారు. టీఆర్ ఎస్ స్థానిక అభ్యర్థి ఆల వెంకటేశ్వర్రెడ్డిని ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారని, ఆయన మాత్రం మిషన్ కాకతీ య, మిషన్ భగీరథ పేరుతో కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధి కారంలోకి వస్తే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణామాఫీ, డ్వాక్రా మహిళలకు సబ్సిడీ ద్వారా రూ.10 లక్షలు రుణాలందిస్తామన్నారు. ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అమ్మ హస్తం పేరిట 9 రకాల నిత్యావసర సరుకులు, ఒక్కొక్కరికి 7 కిలోల సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పారు.
ప్రజలే గుణపాఠం చెప్పాలి : విజయశాంతి
నాలుగున్నరేండ్ల పాలనలో ప్రజలకు మాయమాటలు చెప్పిన కేసీఆర్కు వచ్చే ఎన్నికల్లో ఓట్ల ద్వారా గుణపాఠం చెప్పాలని స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి అన్నారు. విద్యార్థులు ఎన్నో ఆశలు పెట్టుకొని పోరాడి రాష్ట్రాన్ని సాధించుకుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్, కేజీ టు పీజీ ఉచిత విద్య అందించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. విద్యార్థుల ఆశలను తుంగలో తొక్కి తెలంగాణను ఏలిన దొంగలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కై ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాయని విమర్శించారు. అడ్డదారి తొక్కి వచ్చే ఎన్నికల్లో మళ్లీ లబ్దిపొందాలనుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
విద్యార్థులను రెచ్చగొడుతున్న కేసీఆర్ : డి.కె అరుణ
కేసీఆర్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని టీపీసీసీ కో చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యే డి.కె అరుణ అన్నారు. రాష్ట్రం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ దొంగ దీక్షలు చేపట్టి విద్యార్థులను నమ్మించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు కనుమరుగైపోయాయని, కాంగ్రెస్ పాలనలో మహిళలు, అక్కా చెల్లెళ్లు అక్కడకక్కడ కలుసుకుని ఆప్యాయంగా మాట్లాడుకుని సమస్యలు పరిష్కారం చేసుకునే వారని చెప్పారు. మహిళలకు పావలా వడ్డీ రూ. 5 లక్షల దాకా రుణాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దొరల చేతుల్లోకి పోయిందన్నారు. తాము అధికారంలోకొస్తే, నిరుద్యోగ భృతి, డీఎస్సీ నిర్వహించి 20 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షులు ఓబేదుల్లా కొత్వాల్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జి.మధుసూదన్రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.విశ్వేశ్వర్, జెడ్పీటీసీ పీజె బాబు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలమణెమ్మ, ప్రదీప్గౌడ్, మార్కెట్ వైఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొన్నారు.