Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టులకు నీళ్లొచ్చాయంటూ అబద్ధాలు : టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షులు భట్టివిక్రమార్క
- సోనియా కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదు : కుంతియా
- కేసీఆర్ ముఖ్యమంత్రా.. వీధి రౌడా?
- ఫామ్హౌస్లో మందు, ప్రగతి భవన్లో నిద్ర: విజయశాంతి
నవతెలంగాణ-మహబూబ్నగర్ప్రతినిధి
అష్టకష్టాలు పడి, విద్యార్థులు ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నియంత కేసీఆర్ కబంధ హస్తాల నుంచి విడిపిద్దామని టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షులు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తా వద్ద గురువారం కాంగ్రెస్ ఎన్నికల రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరులో కాంగ్రెస్ హయాంలో 90 శాతం నిధులు ఖర్చు చేసి పూర్తి చేసిన కల్వకుర్తి, కోయిల్సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను తామే పూర్తి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.16 వేల కోట్లతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపొందిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని రూ.60 వేల కోట్లతో డిజైన్ మార్చి జేబులు నింపుకుందని ఆరోపించారు. నిధులు పెంచి ఇప్పటి వరకు 10 శాతం మాత్రమే ఖర్చు చేసి జిల్లాను ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధించుకున్న తెలంగాణను ప్రజలు కేసీఆర్ చేతిలో పెడితే ఆయన దాన్ని కొడుకు, కూతురు, అల్లుడికి అప్పగించి దోచుకోమని చెప్పినట్టుగా ఉందని విమర్శించారు. వలసల జిల్లా నుంచి కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే.. పాలమూరు జిల్లా గురించి ఏనాడూ పార్లమెంటులో ప్రస్తావించకపోవడం అత్యంత దారుణమన్నారు. సీఎంగా గెలిచిన తర్వాత ఇక్కడ గెస్ట్హౌస్ కట్టుకుని ఆర్డీఎస్, కర్వేనా ప్రాజెక్టులను పర్యవేక్షిస్తానని చెప్పిన కేసీఆర్ నాలుగేండ్ల కాలంలో నాలుగుసార్లు కూడా జిల్లాకు రాకవపోవడం ఆయన మనోగతాన్ని తెలియజేస్తుందని అన్నారు. నియంత పాలనకు మారు పేరయిన కేసీఆర్కు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరువు జిల్లా పాలమూరుకు సాగునీరందించడానికి భారీ ప్రాజెక్టులకు డిజైన్ చేసి జలయజ్ఞం ద్వారా పూర్తి చేసేందుకు సంకల్పించినట్టు వివరించారు. శ్రీశైలం మొదలుకుని జూరాల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. నిధులు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేస్తే అధికారంలోకొచ్చిన టీఆర్ఎస్ నీళ్లొదిలి ప్రాజెక్టులను తామే నిర్మించామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
విమర్శించే అర్హత టీఆర్ఎస్కు లేదు : కుంతియా
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సోనియా కుటుంబాన్ని విమర్శించడానికి టీఆర్ఎస్ నాయకులకు అర్హత లేదని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కుంతియా అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ ప్రాణం వదిలారని, అలాంటి త్యాగధనుల గురించి విమర్శలు చేయడం తగదని అన్నారు. విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం బలవుతుంటే చలించిన సోనియమ్మ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తేనే సీఎం అయిన విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దన్నారు. చీటికి మాటికి బంగారు తెలంగాణ అంటున్న సీఎం రాష్ట్రంలో ఏ ఒక్క సమస్యకూ పరిష్కారం చూపలేదన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉపాధి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, సీఎంగా దళితుడు అనే మాటలు మర్చిపోయావా అని కేసీఆర్ను ప్రశ్నించారు. రాములమ్మ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వంద స్థానాలు సునాయాసంగా గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రా.. వీధి రౌడా.. : విజయశాంతి
ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్ ముఖ్యమంత్రిలా కాకుండా, వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి అన్నారు. నిత్యం ఫామ్హౌస్లో మందుతాగి, ప్రగతి భవన్లో నిద్రపోవడం తప్ప రాష్ట్రానికి కేసీఆర్ ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు ఇంటిని శుభ్రం చేసుకోవడానికి కూడా పనికిరావని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్న కేసీఆర్ ఐదువేల పాఠశాలలను మూసేసి లక్షలాది మంది విద్యార్థులకు చదువును దూరం చేశారని విమర్శించారు. క్యాబినెట్లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకుండా అవమానపర్చిన కేసీఆర్కు సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో మొదటి సీఎం అయిన కేసీఆర్ అభివృద్ధి చేస్తారనుకుంటే ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అప్పటి ఉద్యమ నాయకుడిలా లేరని, అలాకాకుంటే తెలంగాణ ఉద్యమంలో వీరవనితలా పనిచేసిన రాములమ్మను పక్కనబెట్టి రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి పెద్దపీట వేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.