Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కింగ్ మేకర్ కావాలనే ఆకాంక్ష !
- అనుకూలించని రాజకీయ పరిస్థితులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు బీజేపీకి మింగుడుపడటం లేదు. విభిన్న పరిణామాలుతో ఉక్కిరి భిక్కిరవుతున్నది. శక్తి తక్కువగా ఉన్నా, రెండెంకల సీట్లను గెలుచుకుని కింగ్ మేకర్ కావాలనే ఆకాంక్షతోనే కనిపి స్తున్నది. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది. టీఆర్ఎస్తో లోపాయికారి ఓప్పంధం ఇప్పటికే జాతీయ స్థాయిలో చేసుకుని, రాష్ట్రంలోని ఇద్దరు, ముగ్గురు రాష్ట్ర ప్రధాన నేతల గెలుపుకు అడ్డంకుల్లేకుండా చేసుకున్నదనే ప్రచారం జోరుగా సాగుతున్నది. అయితే అంతటితో ఆగితే పార్టీ పునాదులకు బీటలు వారే అవకాశాలు ఉన్నాయని ఆపార్టీ భావిస్తున్నది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీచేయడం ద్వారా చీకట్లో బాణం వేయాలని, తద్వారా రెండెంకెల సీట్లకు దగ్గర కావాలని యోచిస్తున్నది. అలా చేయకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బంధులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే అంటున్నారు. రాష్ట్రంలో లోపాయికారిగా టీఆర్ఎస్తో అంటకాగుతున్నా, టీఆర్ఎస్ నుంచి ఆశించిన సహకారం అందడం లేదనే పంచాయతీ ఇప్పటికే ఉంది. స్నేహ పూర్వక పోటీల ద్వారా కనీసం 15 నుంచి 20 సీట్లో పాగా వేయాలని భావిస్తున్నది. తద్వారా కింగ్ మేకర్గా నిలవాల న్నది లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు టీఆర్ఎస్తో అంతర్గతంగా చర్చలు చేస్తున్నది. కాగా గులాబీ బాస్ అందుకు ససేమిరా అంటున్నట్టు సమాచారం. ఈనేపథ్యం లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తులకు కాషాయ గుడ్డ కప్పాలని భావిస్తున్నది. ఎన్నికల్లో కనీసం రూ. 20 కోట్లు ఖర్చు పెట్టుగల సత్తా ఉన్నవారితో ఇప్పటికే చర్చలు నిర్వహి స్తున్నట్టు తెలిసింది. ఇటు టీఆర్ఎస్, అటు మహాకూటమీ వ్యతిరేక ఓట్లను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు ఆపార్టీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు కొంచెం అటు, ఇటుగా వచ్చినా తాము కీలకపాత్ర పోషించే దిశగా వ్యూహారచన చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. అంతేగాక ఒకవేళ ముందస్తు ఎన్నికల్లో గెలవలేకపోతే జాతీయస్థాయిలోనూ తమ పార్టీపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయనే అంచనాతో ఉన్నది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ ఎన్నికల సందర్భంగా సమస్యలు ఎదురయ్యే పిరిస్థితి లేకపోలేదని అంటున్నవారు ఉన్నారు. పార్టీ జాతీయ నాయకత్వం ఆ రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని, అక్కడ ఉన్న ప్రభుత్వాలను కాపాడుకునే పనిలో ఉంటుందని, రాష్ట్రానికి సమయం తక్కువగా ఇవ్వొచ్చని భావిస్తున్నది. ఈ తరుణంలో కొంత నష్టమేనని ఆ పార్టీ నేతల సమాలోచనల్లో బయటపడుతున్నది. ఇదిలావుండగా మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పార్టీకి కూడా దెబ్బతగిలే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలతోపాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి జాతీయస్థాయిలో నూకలు చెల్లే ప్రమాదం కూడా పొంచి ఉందని అంటున్నారు. అందుకే అసంతృప్తులకు గాలం వేసే పనిలోభాగంగా ఇప్పటికే టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, సినీనటుడు బాబూమోహన్ను ఢిల్లీ తీసుకెళ్లి పార్టీ చీఫ్ అమిత్షా చేత కాషాయ కండువా కప్పించారు. ఇకపోతే కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ భార్య పద్మినిరెడ్డికి పార్టీ తీర్థం అందించారు. ఈ తరహాలోనే మరికొందరితో మంతనాలు జరుపుతున్నట్టుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా మతోన్మాద ఎజెండాను సైతం ముందుకు తెస్తున్నది. దమ్ముంటే ఎంఐఎం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీకి పెట్టాలనే సవాల్, ఆకోవలోనిదేనని సమాచారం. ఆ పేరుతో ఓట్లు, సీట్లు పెంచుకునే ఎత్తుగడ వేసిందనే ప్రచారం బీజేపీ శ్రేణుల్లోనే సాగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కమలం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైందని రాజకీయ విశ్లేషణలు చోటుచేసుకుంటున్నాయి.