Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దామోదర్ కుటుంబీకులకే నచ్చలేదు
- ప్రతిపక్ష హోదా కోసమే టీడీపీతో పొత్తు
- ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తాం : ఆపద్ధర్మ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ-రాయికోడ్
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర్ రాజనర్సింహా కుటుంబీకులకే నచ్చడం లేదని, ఇంక ప్రజలకేం నచ్చుతుందని ఆపద్ధర్మ మంత్రి హరీశ్రావు అన్నారు. మ్యానిఫెస్టో నచ్చకపోవడంతోనే దామోదర్ రాజనర్సింహా సతీమణి పద్మజ గురువారం బీజేపీలో చేరారన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్ చౌరస్తాలో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాను అడిగిన 12 ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే ప్రజలకు సంబంధించినవి కావంటూ ఉత్తమ్కుమార్రెడ్డి దాటవేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కాపాడుకునేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకుంటోందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆంధ్రా పాలకుల తొత్తులుగా పని చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతులకు ఉచిత కరెంటు ఇస్తామంటే 60ఏండ్లయినా సాధ్యం కానిది ఒక్క ఏడాదిలో ఎలా చేస్తారని జానారెడ్డి ఎద్దేవా చేశారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి చూపిందన్నారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణను సాధించుకుంది ఆంధ్రా పాలకుల చేతికి అప్పగించడానికా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీల కుయుక్తులను ప్రజలు అర్థం చేసుకుని ఆలోచించి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాలు సింగూరు నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకే మళ్లించాయని, ఆందోల్ ప్రజలకు బోరింగ్ నీళ్లే దిక్కయ్యేవని అన్నారు. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సింగూరు నీటిని ఉమ్మడి జిల్లా ప్రజల తాగు, సాగుకు అందించిందని చెప్పారు. ఆందోల్లో 40వేల ఎకరాలకు నీరు పారించామన్నారు. దామోదర్ రాజనర్సింహా డిప్యూటీ సీఎంగా ఉండి ఆందోల్ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లోని అన్ని టీవీ సర్వేల్లో టీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడిస్తున్నాయని హరీశ్రావు చెప్పారు. ఇదే తమ విజయానికి తార్కాణమన్నారు. సభలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.