Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ జేఏసీ అధ్యక్షులు సంపత్నాయక్
నవతెలంగాణ- పాలకుర్తి
నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సాగుతున్న గడీల పాలనను అంతమొందించేందుకు విద్యార్థులు, నిరుద్యోగులు, బహుజనులు ఏకం కావాలని ఓయూ జేఏసీ అధ్యక్షులు సంపత్నాయక్ అన్నారు. తెలంగాణ ఉద్యమ విద్యార్థి తిరుగుబాటు యాత్ర సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చేరుకుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఐలమ్మ, బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజు, ఓయూ-కేయూ జేఏసీ ప్రకటించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి లకావత్ విజరునాయక్, ఓయూ జేఏసీ నాయకులు మురళినాయక్తో కలిసి సంపత్ మాట్లాడారు. 1200మంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం పాలిస్తోందని విమర్శించారు. మద్దతు ధర కోరితే ఖమ్మం జిల్లా రైతులను ఉగ్రవాదుల తరహాలో చిత్రీకరించారని, రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపిన ఘనత కేసీఆర్ది అని విమర్శించారు. ప్రశ్నించేతత్వం లేనంత కాలం బానిసత్వం ఉంటుందన్నారు. బానిసత్వం నుంచి విముక్తి దక్కే వరకు ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని పిలుపునిచ్చారు. దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయని కేసీఆర్ను ప్రశ్నించారు. గిరిజనులను మోసం చేసేందుకే తండాలను ఉత్తుత్తి పంచాయతీలుగా ఏర్పాటు చేశారన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియా అవతారమెత్తి దళితుల ప్రాణాలు తీస్తున్నారన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికల ముందు కొత్తనాటకం మొదలుపెట్టారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఓయూ-కేయూ జేఏసీల అభ్యర్థికి అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. సభలో కత్తి శ్రీను, సురేందర్నాయక్, రాజునాయక్, చక్రి, రవి నాయక్ పాల్గొన్నారు.