Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిగత లబ్దిదారుల మీదే ఆధారపడ్డ టీఆర్ఎస్
- ఒకవైపు ముందస్తు ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. మరోవైపు ప్రచారం ఊపందుకుంది.
ఈ నేపథ్యంలో ఎక్కడైనా అధికార పార్టీ ఇప్పటి వరకూ చేసిన పనులను, చేపట్టిన పథకాలను ఏకరువు పెడుతూ క్యాంపెయిన్లో దూసుకెళుతూ ఉంటుంది. గతంలో తమ మ్యానిఫెస్టోలో ప్రకటించిన అంశాలు.. వాటిలో సాధించిన లక్ష్యాలు, ఇచ్చిన హామీలు, అవి నెరవేర్చిన తీరు తెన్నులను ఓటర్లకు విడమరిచి చెప్పాలనుకుంటారు అధికార పార్టీ నాయకులు. కానీ అందుకు భిన్నంగా టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో చేర్చిన అనేకాంశాలను మరుగు పరిచినట్టు స్పష్టమవుతుంది. ఇదే సమయంలో కేవలం తాము నెరవేర్చిన అంశాలతో కూడిన జాబితాలనే ఎమ్మెల్యే అభ్యర్థులకు పంపిణీ చేసి వాటినే ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలంటూ ఆ పార్టీ దిశా, నిర్దేశం చేసింది. కానీ సమగ్రసర్వే, గ్రామజ్యోతి, మనఊరు మన ప్రణాళిక అంశాల జోలికిమాత్రం పోలేదు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నాలుగేండ్ల కాలంలో సమగ్ర కుటుంబ సర్వే, గ్రామ జ్యోతి, మన ఊరు- మన ప్రణాళిక తదితర కార్యక్రమాలను నిర్వహించిన టీఆర్ఎస్ సర్కారు.. వాటి ద్వారా ఏయే నియోజకవర్గాల్లో ఎన్నెన్ని పనులు చేపట్టారు? అవి ఎంతవరకు పూర్తయ్యాయి? అనే అంశాలను జాబితాల్లో ప్రస్తావించ కుండా జాగ్రత్తపడింది. మరోవైపు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పేర్కొన్న దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి పథాకానికి జాబితాలో అసలు చోటు దక్కకపోవటం గమనార్హం. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు, మిగతా జిల్లాలన్నింటిలో కలిపి మరో లక్షా 70 వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పిన టీఆర్ఎస్ పెద్దలు.. జాబితా రూపకల్పన సందర్భం గా వాటి జోలికే వెళ్లలేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరివ్వకపోతే అసలు ఓట్లే అడగబోనంటూ కేసీఆర్ అనేకసార్లు సభల్లో చెప్పారు. కానీ జాబితాల్లో అసలు ఈ పథకం ఊసే లేదు. నూటికి 90 శాతం గ్రామాలకు ఇప్పటికే నీటి సరఫరా కనెక్షన్లు ఇచ్చామంటూ చెబుతున్న అధికార పార్టీ నేతలు .. ఇప్పటి వరకూ ఏయే జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎన్నెన్ని గ్రామాలకు కనెక్షన్లు ఇచ్చారనే వివరాలు పొందుపరిస్తే బావుండేది. కానీ ఆ వివరాలేవీ జాబితాలో లేకపోవటం గమనార్హం. ఇక ఉద్యోగాల విషయం సరేసరి. అసలు ఈ అంశం గురించి పట్టించుకున్న దాఖలానే లేదు. ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థుల్లో గుబులు రేపుతున్నది. అమలు చేసిన అంశాల గురించి లిస్టు రాసుకున్నాం.. వాటినే ప్రచారాస్త్రాలుగా వాడుకుంటాం... కానీ ఇవిగాక మిగతా వాటి గురించి జనం నిలదీస్తే మన పరిస్థితేమిటనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది. అంతిమంగా ఇలాంటి అంశాలు ప్రచారంలో తమను ఇరుకున పెడతాయేమోననే భయం వారిని వెంటాడుతున్నది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థులతో నిర్వహించిన ముఖాముఖి సందర్భంగా ఈ విషయాలన్నీ వెలుగు చూశాయి. ముఖ్యంగా వారికి అందజేసిన లబ్దిదారుల జాబితాలు, వాటిలోని అంశాలపై ఇప్పుడు సర్వత్రా చర్చ కొనసాగుతున్నది. అభ్యర్థులకు ఇచ్చిన జాబితాల్లో ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, సీఎమ్ఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ పథకాల లబ్దిదారుల సంఖ్యతోపాటు ప్రభుత్వం వల్ల లబ్దిపొందిన అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హోమ్ గార్డుల సంఖ్య (వీరందరికీ వేతనాలు పెంచారు)ను ప్రస్తావించారు. అంటే కేసీఆర్ సర్కారు వల్ల వ్యక్తిగతంగా లబ్దిపొందిన వారి సంఖ్యను మాత్రమే జాబితాల్లో పొందుపరిచారన్నమాట. వీటిలో కూడా ఆసరా పెన్షన్లకే తొలి ప్రాధాన్యతనిచ్చారు. ఇవి కాకుండా మిగతా పథకాల వల్ల లబ్దిపొందిన వారి సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ నియోజకవర్గ జాబితాను తీసుకుంటే ఆసరా పెన్షన్లు పొందిన వారి సంఖ్య 31 వేలుగా ఉంది. కళ్యాణ లక్ష్మి లబ్దిదారులు 3,700, షాదీ ముబారక్ 200, కేసీఆర్ కిట్ 2,600, సీఎమ్ఆర్ఎఫ్ 1,060, ఆరోగ్యశ్రీ లబ్దిదారుల సంఖ్య 13 వేలుగా నమోదైంది. ఇదే ఫార్మేట్లో అన్ని నియోజకవర్గాల జాబితాలను రూపొందించి అభ్యర్థులకు అందజేశారు. అయితే నియోజకవర్గాల్లోని మండలాలు, గ్రామాల్లోని మౌలిక వసతుల గురించి మాట మాత్రమైనా ప్రస్తావించకుండా టీఆర్ఎస్ నేతలు జాగ్రత్తపడ్డారు. ముఖ్యంగా పాఠశాలలు, వైద్యశాలలు, రోడ్లు, రవాణా, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, మాతా, శిశు మరణాలు, పిల్లలకు పౌష్టికాహారం, పశువైద్య శాలలు తదితర అంశాల జోలికెళ్లలేదు. ఇలాంటి విషయాలను లిస్టుల్లో పేర్కొంటే అవి ఉల్టాగా తమకే నష్టం చేస్తాయనే భావన అధికార పార్టీలో నెలకొందని విశ్లేషకులు ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పథకాల వల్ల నియోజకవర్గాల్లోని ప్రజలు లబ్ది పొందినప్పటికీ సామాజికంగా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించకపోతే అది అంతిమంగా సమాజానికి నష్టం చేకూరుస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.