Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు విశ్వవిద్యాలయాల బలోపేతమే లక్ష్యం:
విద్యార్థులకు ఉత్తమ్ హామీ
- పలు యూనివర్సీటీల విద్యార్థులు కాంగ్రెస్లో చేరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రానున్న ప్రభుత్వంలో ప్రయివేట్ యూనివర్సిటీలు ఉండవని, వాటిని రద్దు చేసి ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను బలోపేతం చేస్తామని చెప్పారు. మంగళవారం ఇందిరాభవన్లో పలు యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు కాంగ్రెస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కారు యూనివర్సిటీలను పట్టించుకోలేదని, మహాకూటమి అధికారంలోకి రాగానే వాటిని పటిష్టం చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఒక్కొక్క విద్యార్థి కనీసం 100 ఓట్లు కాంగ్రెస్కు వేయించాలని కోరారు. అధికార బలం, డబ్బు, మద్యంతో టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు హామీలు ఇవ్వటంలోనూ నకిలీగానే వ్యవహరిస్తారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు 16 రూపాయలు అధికంగా పెంచి టీఆర్ఎస్ ప్రకటించిందన్నారు. నాలుగేండ్లు అధికారంలో ఉండి ఎందుకు నిరుద్యోగ భతి ఇవ్వలేదని ప్రశ్నించారు. ముందుగా నిరుద్యోగులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను మోసం చేశారన్నారు. డిసెంబర్12న మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే లక్ష ఉద్యోగాలు ఇస్తామని, 20 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇస్తామని, నిరుద్యోగులకు రూ 3వేల భతి అమలు చేస్తామన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయని పెద్దలను సన్నాసులు అనాలా? దద్దమ్మలు అనాలా? కేసీఆరే చెప్పాలన్నారు. ఆంధ్ర పాలకుల కంటే ఎక్కువ దోచుకున్నది కేసీఆర్ కుటుంబమేనని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో దోచుకోవడం...దాచుకోవడమే పనిగా పెట్టుకుని అధికారాన్ని ఆ నలుగురు ఎంజారు చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ చదివింది ఆంధ్ర ప్రాంతంలో...ఉద్యోగం చేసింది అమెరికాలో మరి ఉద్యమం ఎక్కడ చేశారని ప్రశ్నించారు.