Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్కంఠ భరితంగా జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. పరస్పర విరుద్ధమైన సర్వేలతో ఈ ఎన్నికల్లో ఫలితాలను ఊహించటం కష్టతరమై పోయింది. ఇక నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్లు హద్దులు దాటిపోయాయి. కొంగరకలాన్లో ప్రగతి నివేదన సభతో పేలవమైన ప్రదర్శన ప్రారంభించిన గులాబీ పార్టీ చివరికి పుంజుకుని అనూహ్యమైన ఫలితాలను సాధించింది. ఒంటరి పోరుతో దిగాలు పడిన కాంగ్రెస్ శ్రేణులకు కూటమి ఏర్పాటు పునరుత్తేజం ఇచ్చింది. ప్రభుత్వంపై సార్వత్రిక వ్యతిరేకత కానీ అనుకూలత కానీ కనిపించక పోయినా ఫలితాలు మాత్రం టీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చాయి. అధికార పార్టీని గెలిపించాలని కొన్ని వర్గాల్లో ఉన్న కోరిక, ఓడించాలని మరికొన్ని వర్గాల్లో ఉన కసి వంటి సరస్పర విరుద్ధమైన ధోరణులు చివరి వరకూ వ్యక్తమయ్యాయి. సంక్షేమ పథకాల ప్రభావం కనిపించటం రాష్ట్రంలోని పేదరికానికి, ఆర్థిక అసమానతలకి అద్దం పడుతున్నది. ఈ ఆర్థిక అసమానతలను తొలగించటం ద్వారా మార్పు తీసుకురావాలని ప్రయత్నించిన బీఎల్ఎఫ్కు శక్తి చాలలేదు. తాము అనుసరించిన విధానాలనే టీఆర్ఎస్ కూడా కొనసాగించటంతో అధికార పార్టీని ప్రశ్నించే నైతిక అర్హతను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. అందుకే ఎన్నికల ఫలితాల్లో బోర్లాపడింది. టీఆర్ఎస్తో దాగుడుమూతలాడి లబ్ది పొందాలనుకున్న బీజేపీ ఆశలు అడియాశలయ్యాయి.