Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల రాజకీయాలు పనిచేయలేదు..
- సంక్షేమమే గెలిచింది
- కేసీఆర్ గెలవాలని దేవుళ్లను మొక్కా : పోసాని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణకు చంద్రబాబు వచ్చినట్టుగానే కేసీఆర్ సైతం ఆంధ్రప్రదేశ్కు వెళ్లి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినందుకు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లో తన నివాసంలో బుధవారం పోసాని మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కులపిచ్చితో కాకుండా సీఎం కేసీఆర్ సంక్షేమాన్ని చూసి ఓట్లేశారని అభిప్రాయపడ్డారు. ఏపీలో నిజాయితీ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నుకోవాలని కమ్మసామాజిక తరగతిని కోరారు. చంద్రబాబు, లగడపాటి సైంధవుళ్లుగా తెలంగాణకు వచ్చి కేసీఆర్ను ఓడించేందుకు విచ్చలవిడిగా ఖర్చుపెట్టారని, కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే ఆయన్ను గెలిపించాయని చెప్పారు. ఏపీలో తహసీల్దార్పై దాడి జరిగితే చంద్రబాబు పట్టించుకోలేదని, అదే కేసీఆర్ అనాథ బాలికకు అన్యాయం జరిగితే న్యాయం చేశారని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సైతం గెలవాలని ఎప్పుడూ కోరుకోలేదని, కేసీఆర్ గెలవాలని దేవుళ్లను మొక్కానని చెప్పారు. గద్దర్ అంటే తనకు ఎంతో అభిమానమని, అలాంటి వ్యక్తి కాంగ్రెస్తో కలిసి ప్రచారం చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. సెటిలర్లను సైతం తెలంగాణ బిడ్డలుగా కేసీఆర్ చూసుకున్నారని, అందుకే బాబు ఎత్తుగడలను వారు తిప్పికొట్టారని అన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని అభిప్రాయపడ్డారు.