Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో రెండు గిన్నిస్ రికార్డులు
- కాగితపు పువ్వులతో విభిన్నంగా బొమ్మల కొలువు
- విద్యార్థిని శివాలిజోహ్రీ ఘనత
నవతెలంగాణ- పటాన్చెరు
విభిన్న కాగితపు పూలతో ఓరెగామి వెల్స్(3,501), ఓరెగామి పెంగ్విన్స్(2,100) బొమ్మల కొలువుతో రెండు గిన్నిస్ రికార్డుల్ని 'గీతం' విద్యార్థిని శివాలిజోహ్రీ శ్రీవాస్తవ కైవసం చేసుకుంది. ఇప్పటికే మూడు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్న ఆమె మరో రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని గీతం విశ్వవిద్యాలయంలో బీటెక్ సీఎస్ఈలో మూడో సంవత్సరం చదువుతున్న శివాలి తల్లి కవితజోహ్రీ శ్రీవాస్తవతో కలిసి ఈ రికార్డు సాధించడం విశేషం. వీరు తీర్చిదిద్దిన విభిన్న బొమ్మల కొలువును వీడియోలు తీసిన 'గీతం' ప్రతినిధులు గిన్నిస్ అధికారులకు పంపించారు. గిన్నిస్ రికార్డు కైవసం చేసుకున్నట్టు గీతం అధికారులకు సమాచారమందింది. శివాలి గతంలో హ్యాండ్మేడ్ పేపర్తో అందించిన 1251 విభిన్న బొమ్మలను కొలువు తీర్చి తొలి గిన్నిస్ రికార్డు సాధించింది. ఆ తర్వాత 7011 విభిన్న కాగితం పువ్వులను ప్రదర్శించి రికార్డు, 2111 విభిన్న బొమ్మలను ప్రదర్శించి రికార్డులను కైవసం చేసుకుంది. మొత్తంగా ఇప్పటివరకు ఐదు గిన్నిస్ రికార్డులను శివాలి సాధించింది. గీతం రెసిడెంట్ డైరెక్టర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సంజరు, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ రామారావు, స్కూల్ ఆఫ్ ఫార్మసి ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఎస్ కుమార్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్, జీహెచ్బీఎస్ డీన్ అండ్ డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మణ్కుమార్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు వారిని అభినందించారు.