Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సీఎంగా రెండోసారి ప్రమాణం
- ఆయనతోపాటు మహమూద్ అలీ కూడా...
- హాజరైన పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం హైదరాబాద్లోని రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం సరిగ్గా 1.25 గంటలకు కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. 'కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. ' అంటూ తెలుగులో ప్రమాణం చేశారు. ఆయనతో పాటు ఆప ధర్మ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఉర్దూలో ప్రమాణం చేశారు.
కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్రావుతోపాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు, మహమూద్ అలీ కుటుంబ సభ్యులు, పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లూ హాజరయ్యారు. నూతన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2014 జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు ఆయనతోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అనంతరం మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఈసారి అందుకు భిన్నంగా కేసీఆర్తో పాటు మహమూద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం. తొలిసారి 11మంది ప్రమాణం చేసినప్పుడు కూడా వారిలో మహమూద్ అలీ ఉన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్, మహమూద్ అలీ కుటుంబ సభ్యులతో గవర్నర్ దంపతులు ఫొటోలు దిగారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు కేసీఆర్కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.