Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాధనం దుర్వినియోగమంటున్న నిపుణులు
- భూసేకరణతో నగరవాసులకు తప్పని తిప్పలు
నవ తెలంగాణ - సిటీబ్యూరో
'హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరమవుతున్నది. కాలుష్యం పెరుగుతున్నది. వీటన్నింటికీ పరిష్కారమే మెట్రోరైలు ప్రాజెక్టు' అని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. అందులో భాగంగానే రూ.14,132 కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ప్రాజెక్టు 2017 నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఒక పక్క ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా చూపిన మెట్రో రైలు ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే మరో సమగ్ర రోడ్డు అభివృద్ధి పథకం (ఎస్ఆర్డిపి)లో భాగంగానే నగరంలో రూ.20 వేల కోట్లతో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసి పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటినీ చూస్తుంటే హైదరాబాద్ మహానగరానికి ఓ ప్రణాళికంటూలేదని, ఉంటే నగరంలో సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థ ఎలా ఉండాలో అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించి దాని ప్రకారం పనులు చేస్తే బాగుంటుందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులను ముందుకు తీసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సమగ్ర ప్రణాళికలేవీ...
భవిష్యత్తు హైదరాబాద్ అవసరాలను ప్రభుత్వాలు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయి. ఆయా ప్రభుత్వ శాఖలూ ప్రణాళికలను రూపొందించలేకపోతున్నాయి. ఐదేళ్ల కాలంలో ఏ ప్రభుత్వముంటే అందుకనుగుణంగా ప్లాన్ తయారు చేయడం, ప్రభుత్వం మారగానే మరో ప్రణాళిక తయారు చేయడం అలవాటుగా మారింది. 15 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే హెచ్ఎండిఎ పరిధిలోని పాత ఎంసిహెచ్ ప్రాంతానికో మాస్టర్ప్లాన్, హుడా మాస్టర్ప్లాన్, సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ (సిడిఎ) మాస్టర్ప్లాన్, హైదరాబాద్ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎడిఎ) మాస్టర్ప్లాన్, రెండేళ్ల క్రితం వచ్చిన హెచ్ఎండిఎ - 2031 మాస్టర్ప్లాన్లను తయారు చేశారు. వీటితోపాటు ట్రాఫిక్పై లీ అసోసియేట్స్తో సమగ్ర రవాణా వ్యవస్థ (సిటిఎస్) - 2041 సర్వే చేయించారు. ట్రాఫిక్పై అనేక సర్వేలు వచ్చాయి.
ఒక్కటంటే ఒక్కదాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసిన పాపానపోలేదు. అంతేకాదు హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని సిఎం కెసిఆర్ పదేపదే చెబుతున్నారు. కాని విశ్వనగరానికి అనుగుణంగా ఓ సమగ్రమైన మాస్టర్ప్లాన్ రూపొందించడానికి సిద్ధంగా లేరు. ఇష్టమొచ్చినట్లు స్కైవేలు, మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ, తాగునీటి మాస్టర్ప్లాన్, మురుగునీటి వ్యవస్థ అంటూ ప్రకటనలు చేస్తున్నారు.
మెట్రో మార్గాల్లో...
మెట్రోరైలు మార్గాల్లోనే మల్టీలెవల్ ఫ్లైఓవర్లు నిర్మించడాన్ని ప్రభుత్వ వర్గాలు, సాంకేతిక నిపుణులు తప్పుబడుతున్నారు. మెట్రో రైలు పనులు పూర్తయ్యేవరకు ఆగితే ట్రాఫిక్ సమస్యపై స్పష్టత వచ్చే అవకాశముందని ఇంజనీరింగ్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మలక్పేట్ నుంచి ఎల్బినగర్ వరకు మెట్రోరైలు కారిడార్-1 మార్గం ఉన్నది. మొజంజాహీ మార్కెట్ నుంచి ఛాదర్ఘాట్ మీదుగా మెట్రోరైలు మార్గమున్నది. అయినా అబిడ్స్ జిపిఓ నుంచి చాదర్ఘాట్, మలక్పేట్ వరకు రూ.550 కోట్లతో మల్టీలెవల్ ఫ్లైఓవర్ను ప్రతిపాదించారు. ఇదే తరహాలో సైబర్టవర్స్ జంక్షన్ - ఎలివేటెడ్ రోటరీ కం గ్రేడ్ సపరేటర్ రూ. 225 కోట్లు, రసూల్పురలో రూ.64 కోట్లు ఉప్పల్ రూ.247 కోట్లు, కెబిఆర్ పార్కు చుట్టూ, జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద కూడా ఫ్లైఓవర్ను నిర్మించనున్నారు.
వీటికి బదులు మెట్రో రైలు మార్గంలేని ప్రాంతాల్లో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య తీరుతుందని వారు సూచిస్తున్నారు.
భూసేకరణతో తిప్పలు
మెట్రోరైలు ప్రాజెక్టు పనుల్లో భాగంగా చేపట్టిన భూసేకరణతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ ఆ ప్రక్రియ సమస్యాత్మకంగా ఉన్నది. పైగా సమగ్ర రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డిపి) పనులకు భూసేకరణ చేయాలంటే కష్టతరమే.
మొదటి దశ పనులకు సంబంధించిన భూసేకరణకు రూ.1,420 కోట్లు ఖర్చు అవుతాయని జిహెచ్ఎంసి అంచనా వేసింది. ప్రభుత్వ స్థలాలు 49.15 ఎకరాలు, ప్రైవేటు ఆస్తులు 581 సేకరించాల్సి ఉన్నది. అయితే భూసేకరణ పూర్తయిన తర్వాతనే పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మల్టీలెవల్ ఫ్లైఓవర్లు నిర్మించే ముందు సమగ్ర ప్రజా రవాణాపై అధ్యయనం చేయాలని పలువురు సూచిస్తున్నారు.