Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దారులు వెతుక్కుంటున్న కాంగ్రెస్ నేతలు
- ఓటమిని ఈవీఎంలపై నెట్టేస్తున్న వైనం: కోర్టును ఆశ్రయించాలని టీపీసీసీ నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన కాంగ్రెస్ పోస్టుమర్టమ్ ప్రారంభించింది. ఎక్కడ పొరపాటు జరిగిందనే అంశాలపై నాయకులు విశ్లేషణలు చేస్తున్నారు. తమ తప్పిందాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర నాయకత్వం దారులు వెతుక్కుంటున్నారు. వైఫల్యాలను నిజాయితీగా అంగీకరించి సరిదిద్దుకోకునే ప్రయత్నం చేయకుండా ఈవీఎంలను బూచిగా చూపించి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం గాంధీభవనన్లో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన పార్టీ నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, అత్రం సక్కు, రాజగోపాల్రెడ్డి, జగ్గారెడ్డి, చిరుమర్తి లింగయ్య, జెట్టి కుసుమకుమార్, అజారుద్దీన్ తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో ఓటమిపై ప్రాథమికంగా చర్చించారు. ఈవీఎంల ట్యాంపరింగ్, ఓటమికి గల కారణాలపై నేతలు విశ్లేషించారు. ఎన్నికల అధికారులు వ్యవహరించిన తీరుపై సమావేశంలో చర్చించారు. టీఆర్ఎస్కు అనుకూలంగా ఈసీ వ్యవహరించిందంటూ ఎక్కువ మంది నాయకులు అభిప్రాయపడ్డారు. ఓటర్ల తొలగింపు, అవకతవకలపై ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని వాపోయారు. ఎన్నికలనంతరం కూడా ఈవీఎం ట్యాంపరింగ్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరినా పట్టించుకోకపోవడాన్ని పలువురు నేతలు తప్పుపట్టారు. దీనిపై హైకోర్టులో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్పై నియోజకవర్గాల్లో జరిగిన అక్రమాలపై వేర్వేరుగా కాకుండా ఉమ్మడిగానే న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. ఈవీఎంల్లో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో క్రోఢికరించి, సమన్వయపరిచేందుకు టీపీసీసీ ప్రత్యేకంగా దాసోజు శ్రవణ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది.
పేపర్ బ్యాలెట్ ఉద్యమం ప్రారంభిస్తాం : దాసోజు
ఈవీఎం ట్యాంపరింగ్లపై అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పేపర్ బ్యాలెటే శరణ్యమని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. సమావేశానంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ పేపర్ బ్యాలెట్ ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. 40 నుంచి 50 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు ప్రచారానికి రాకుండా అడ్డుకున్నారని,ఆ నియోజకవర్గాల్లోనే వారికి భారీ మెజార్టీ ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసీ అధికార పక్షానికి లొంగిపోయిందని ఆయన ఆరోపించారు. ఓటర్ల అవకతవకలపై కోర్టులో కేసు కొనసాగుతుండగానే ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లెవనెత్తుతామని చెప్పారు. ఈవీఎం ట్యాంపరింగ్లు, ఓటర్ల తొలగింపు తదితర అంశాలపై జాయింట్పార్లమెంటరీ కమిటీ (జేఏసీ) విచారణ జరిపించాలని కోరనున్నట్టు తెలిపారు. రిటర్నింగ్ అధికారులు, పోలీసులు కుమ్మక్కైయి పోలింగ్ ఏజెంట్లను కూడా బూత్ల్లోకి రాన్విలేదని మండిపడ్డారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణలో ఓట్ల దొంగలు పడ్డారని ఆరోపించారు.