Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 22న సన్నాహకంగా రాష్ట్ర సదస్సు : కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వచ్చేనెల 8,9 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్ల నాయకులు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్, జె వెంకటేష్, ఎస్ రమ (సీఐటీయూ), ఉజ్జిని రత్నాకర్రావు (ఏఐటీయూసీ), విజరుకుమార్ యాదవ్ (ఐఎన్టీయూసీ), ఉదయ భాస్కరరావు (హెచ్ఎంఎస్), భరత్ (ఏఐయూటీయూసీ), ఎం శ్రీనివాస్ (ఐఎఫ్టీయూ), బి వెంకటేశం (టీఆర్ఎస్కేవీ), కె సూర్యం (ఐఎఫ్టీయూ), ఎంకె బోస్ (టీఎన్టీయూసీ) మాట్లాడుతూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సన్నాహకంగా ఈనెల 22న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సదస్సుకు కార్మిక సంఘాలకు చెందిన జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొంటారని అన్నారు. మోడీ ప్రభుత్వం నాలుగున్నరేండ్లుగా కార్మికవర్గ సమస్యలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్, ప్రభుత్వరంగాన్ని ధ్వంసం చేసిందన్నారు. ఆరున్నర దశాబ్ధాలుగా అభివృద్ధి చెందిన రక్షణరంగ ఉత్పత్తుల పెంపు, పరిశోధనా అభివృద్ధి సామర్థ్యాలను నాశనం చేసిందని అన్నారు. రక్షణ, రైల్వే రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టి ఉద్యోగులు, ప్రజలకు తీరని హాని కలిగించిందని విమర్శించారు. రోడ్డు రవాణా సంస్థలు, ఆయిల్, విద్యుత్, స్టీల్, బొగ్గు వంటి రంగాల్లో వ్యూహాత్మక అమ్మకాల ద్వారా ప్రయివేటీకరణను వేగవంతం చేస్తోందన్నారు. ఔట్సోర్సింగ్ విధానాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు. విదేశీ పెట్టుబడులను వంద శాతం తీసుకొచ్చేందుకు ఉవ్విళ్లూరుతోందని అన్నారు. కార్మికవర్గం అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా సవరించి యాజమాన్యాలకు మేలు చేసిందని చెప్పారు. కార్మికులు కూడబెట్టిన రూ.24 లక్షల కోట్ల సాంఘిక సంక్షేమ నిధిని షేర్ మార్కెట్ వ్యాపారానికి మళ్లించచూస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని రద్దు చేయాలనీ, కోరినా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందనీ విమర్శించారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను సంక్షోభంలోకి నెట్టిందని చెప్పారు. కార్మికులు, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ హక్కులను ద్వైపాక్షిక, త్రైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించిందని అన్నారు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, కనీస వేతనాల గ్యారంటీ, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. 2017 మోటారు వాహనాల రోడ్డు రక్షణ చట్టం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందున 2015, 2016లలో జాతీయ స్థాయిలో సమ్మెలు జరిగాయని గుర్తు చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఆందోళన, పోరాటాలు జరిగాయని చెప్పారు. ఇంతటి ప్రతిఘటన ఎదురైనప్పటికీ మోడీ ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలను మొండిగా కొనసాగిస్తోందని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం అవినీతి విశృంఖలంగా పెరిగిపోయిందని చెప్పారు. వాక్, సభా, స్వాతంత్య్ర హక్కులపై దాడి జరుగుతోందని అన్నారు. దళిత, గిరిజన, మహిళలపై హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, పౌరహక్కులను హరిస్తోందన్నారు. ఆర్ఎస్ఎస్ జోక్యం అన్ని విభాగాల్లోనూ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్థితిలో జాతి సంపదను కార్పొరేట్ గుత్త పెట్టుబడిదారులకు దోచిపెట్టే విధానాలను నిరసిస్తూ కార్మిక, రైతాంగ, ప్రజా సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వ సరళీకృత ఆర్థిక విధానాలపై ఉధృత పోరు సాగించే లక్ష్యంతో సార్వత్రిక సమ్మెకు సన్నద్ధమవుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండి మహమూద్ (ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్), పి వెంకట్రామయ్య (బెఫీ), శ్రీనివాసరావు (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కాన్ఫెడరేషన్), రాజుభట్ (టీఎంఎస్ఆర్యూ), ఎ వెంకటేష్ (ఏఐటీయూసీ), పి సుధాకర్ (హమాలీ ఫెడరేషన్) పాల్గొన్నారు.