Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తక పఠనాన్ని పెంచడమే మా ధ్యేయం
- ప్రతి రోజూ మధ్యాహ్నం బాలోత్సవ్ కార్యక్రమాలు
- పదిలక్షల మంది పుస్తకప్రియులు సందర్శించే అవకాశం: హైదరాబాద్ బుక్ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోటిదీపోత్సవాల కార్యక్రమాన్ని మించి కోటికిపైగా పుస్తకాల వెలుగులను తెలంగాణ సమాజానికి పంచేందుకు తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం) వేదిక కాబో తున్నది. ప్రతి పౌరునిలోనూ చైతన్యం నింపేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కపిలవాయి లింగమూర్తి ప్రాంగణంలోని పుస్తకాల తోట పుస్తక ప్రియుల మెదళ్లలో వెలుగులు నింపనున్నది. భవిష్యత్ తరాన్ని పుస్తక పఠ నంవైపు మరల్చి సామాజిక చింతనను నింపే కేంద్రం విరా జిల్లనున్నది. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీసి జ్ఞాన తెలంగాణకు అడుగులు వేయనున్నది. 10 లక్షల మందికి పైగా పుస్తకప్రియులు లింగమూర్తి ప్రాంగణాన్ని సందర్శించే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ బుక్ఫెయిర్ ఆధ్వర్యంలో ఉప రాష్ట్రపతి డాక్టర్ కె.వెంక య్యనాయుడు చేతుల మీదుగా పుస్తక పండుగ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో జ్ఞాన బండారంలో ఏర్పాట్లపైనా, ఈ ఏడాది బుక్ఫెయిర్ ప్రత్యేకతలపైనా నవతెలంగాణ ప్రతినిధితో హైదరాబాద్ బుక్ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ ముచ్చటించారు. ముఖ్యాంశాలు ఇలా..
ప్ర: బుక్ఫెయిర్ ప్రచారాన్ని జనబాహుళ్యంలోకి ఎలా తీసుకెళ్లారు? పఠనాసక్తి ఆవశ్యకతను ఎలా చెప్పారు?
జూలూరు గౌరీశంకర్ : లక్షలాది మంది విద్యార్థులను కలిశాం. మాట్లాడాం. మెసేజ్ ఇచ్చాం. బుక్ఫెయిర్ ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చివరకు రైల్వే వ్యాగన్లలో పనిచేసే కూలీల వద్దకూ వెళ్లాం. బుక్ఫెయిర్కు రావాలని, అక్కడున్న పుస్తక ప్రపంచాన్ని సందర్శించాలని విస్తృతంగా ప్రచారం చేశాం. విద్యార్థుల్లో పఠనాసక్తిని పొంపొందించేలా ముందుకు సాగాం. తొలుత వ్యక్తిగత పరివర్తన రావాలి. అది సామాజిక పరివర్తనగా మారాలి. వ్యక్తి శక్తివంతుడైనప్పుడే దేశానికి కావాల్సిన మంచి మానవ వనరు లభించే అవకాశం ఉంటుంది. అతనిలో సమాజానికి సంబంధించిన ఒక చింతన ఉండాలి. మా పిల్లలు ఇంజినీర్లు అయ్యారు.. లాయర్లు అయ్యారు...టీచర్లు అయ్యారు...అని గొప్పగా చెబుతున్నారు. ఏం ప్రయోజనం? సైన్స్ చదివిన వ్యక్తి సమాజ పురోగాభివృద్ధికి ఆ సైన్స్ను ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి. మళ్లీ అతనిలో మూఢత్వాలను పట్టుకుని వేలాడే లక్షణాలు ఉండొద్దు. అందుకే కేవలం సబ్జెక్టులు కాకుండా ప్రపంచ పరిజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను, సాహిత్యాన్ని విరివిగా అధ్యయనం చేయాలి. ఎంత సబ్జెక్టు ఉన్నప్పటికీ సామాజిక చింతన ఉండాలి. అది ఉన్నప్పుడే సమాజాభివృద్ధికి ఆ వ్యక్తి ఉపయోగపడతాడు. ఆ సామాజిక చింతనను యువతలో పెంచడమే మా ధ్యేయం.
ప్ర : బుక్ఫెయిర్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
జూలూరు గౌరీశంకర్: ఎన్టీఆర్ స్టేడియం (తెలంగాణ కళాభారతి)లోని కపిలవాయి లింగమూర్తి ప్రాంగణాన్ని పుస్తక పండుగకు సిద్ధం చేశాం. ప్రతిరోజూ చర్చాగోష్టిలు, పుస్తక ఆవిష్కరణలు, సభలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు స్వాతంత్య్ర సమరయోధురాలు, మాజీ మంత్రి సంగం లక్ష్మీబాయి పేరుమీద ఓ వేదిక, ఇటీవల మృతిచెందిన సాహితీవేత్త జాతశ్రీ పేరుమీదుగా మరో వేదికను ఏర్పాటు చేశాం. బుక్ఫెయిర్ నిర్వహణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతున్నది. 14 రోజుల పాటు కళాభారతి ఉచితంగా ఇచ్చింది. పుస్తకాలను విరివిగా చదివే ముఖ్యమంత్రి కేసీఆర్ పుస్తక ప్రపంచం నిర్వహణకు చక్కగా సహకరిస్తున్నారు.
ప్ర : బుక్ఫెయిర్లో ఈసారి ప్రత్యేకతలు ఏంటీ?
జూలూరు గౌరీశంకర్ :మొత్తం 331కిపైగా బుక్స్టాళ్లను ఏర్పాటు చేశాం. పలు రాష్ట్రాల నుంచి పలు పుస్తక ముద్రణా సంస్థలు వచ్చి ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేయబోతున్నాయి. ఈసారి ప్రత్యేకంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బాలోత్సవ్లో భాగంగా పిల్లల కార్యక్రమాలను చేపడుతున్నాం. పిల్లల్లోని నిగూడంగా ఉన్న సృజనాత్మక శక్తులను వెలికితీస్తాం. మంచి మెసేజ్ను సమాజంలోకి తీసుకెళ్లబోతున్నాం. వచ్చే ఏడాది నుంచి బుక్ఫెయిర్ మాదిరిలాగే బాలోత్సవ్ను నవంబర్లో నిర్వహించబోతున్నాం. పదిలక్షలకుపైగా పుస్తక ప్రియులు పుస్తక పండుగకు రానున్నారు.
ప్ర: సాహిత్యం, పుస్తక పఠనం పట్ల నేటి యువత అంత ఆసక్తి చూపెట్టట్లేదు కదా..దీనిని అధిరోహించడానికి మీరు చేపట్టిన చర్యలేంటి?
జూలూరు గౌరీశంకర్:తరగతి గదిలో మార్పు రానంత కాలం పుస్తక పఠనం పెరగదు. తరగతి గదిలో మార్పు కావాలి. దానికి ఉపాధ్యాయులు కంకణబద్ధులు కావాలి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థుల్లో పుస్తక పఠనాన్ని పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం కొన్ని కథలు, నవలలు, పాటలు, వ్యాసాలు, కవితలు, చదివించేలా పాఠశాలలో ప్రోత్సాహం ఉండాలి. పదో తరగతి అయిపోయే సరికి కనీసం 50 పుస్తకాలను ప్రతి విద్యార్థి చదివేలా చూడాలి. ఆ దిశగా మేం ప్రయత్నాలు మొదలుపెట్టాం. యువతను ఆకట్టుకోవడానికి బాలసాహిత్యాన్ని ప్రమోషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
ప్ర: స్కూల్ పిల్లలను, కళాశాల విద్యార్థులను బుక్ఫెయిర్కు రప్పించడానికి ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నారా?
జూలూరు గౌరీశంకర్:హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పిల్లలందర్నీ తీసుకురావాలని పాఠశాలల్లో ప్రచారం చేశాం. జిల్లాల నుంచి పిల్లలను తీసుకురావాలనుకుంటే...బాధ్యులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. కళాశాలల యాజమాన్యాలను కలిసి విద్యార్థులను పంపాలని కోరితే అంగీకరించాయి. బుక్ఫెయిర్కు వచ్చేది ఎక్కువగా యువతనే. పిల్లలందరికీ ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నాం. వాళ్లు వచ్చి పుస్తకాలను చూసినా, తడిమినా మాకు సంతోషమే. ఎందుకంటే వాళ్లలో చదవాలనే ఆలోచన తెప్పించడమే మా ధ్యేయం. పుస్తకం చదివే ఆలోచన ఒక్కసారి మొదలైతే వారి నుంచే ఓ మేధావి పుట్టుకురావొచ్చు.
ప్ర: బుక్ఫెయిర్కు ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారు?
జూలూరు గౌరీశంకర్:బుక్ఫెయిర్ను ఉపరాష్ట్రపతి డాక్టర్ కె.వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. హోంమంత్రి మహమూద్ అలీ, టీఎస్పీఎస్సీ చైర్మెన్ ఘంటా చక్రపాణి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లంనారాయణ, తెలంగాణ సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, తదితర అతిథులు ప్రారంభ వేడుకల్లో పాల్గొననున్నారు.