Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వల్ప దీర్ఘకాలిక లక్ష్యాలపై సర్కారు గురి
- ఐదు పెద్ద ప్రాజెక్టులకు ప్రాధాన్యం
- నేడు సీఎం సమీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసే దిశగా సర్కారు కసరత్తు ప్రారంభించింది. కేసీఆర్ సీఎంగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారి ప్రాజెక్టులపై శనివారం సమీక్షించనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు పూర్తి సమాచారంతో నివేదిక తయారు చేశారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రీడిజైన్ పేరుతో ప్రధాన ప్రాజెక్టుల రూపురేఖలు పూర్తిగా మార్చి వేసింది. అంతరాష్ట్ర సమస్యలు, అనుమతులు రావటంతో జరిగిన జాప్యంతో పాటూ భూసేకరణ సమస్యతో నాలుగున్నరేండ్ల కాలంలో ఆశించిన మేరకు పనులు ముందుకు సాగలేదు. గోదావరి నదిపై చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యమివ్వటంతో ఆ ప్రాజెక్టు పనులు 60 శాతం వరకూ పూర్తయినట్టు అధికారులు రూపొందించిన నివేదిక స్పష్టం చేస్తున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరందించటంతో పాటూ మరో 16 లక్షల ఎకరాలను స్థిరీకరించటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 82 వేల కోట్లు కాగా ఇప్పటికే దీనిలో 20 వేల కోట్లు మొదటి దశలోనే రుణంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకుల కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకున్నది. రాష్ట్రంలో కరువు ప్రాంతానికి సాగునీరందించే పాలమూరు ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే విమర్శల నేపధ్యంలో ఈ ప్రాజెక్టుకు ద్వితీయ ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయించాలని సీఎం భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు 30 శాతం కూడా పూర్తి కాలేదని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. రీడిజైన్ పేరుతో చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులతో పాటు డిండి, సీతారామ, ఎస్సారెస్పీ పునరుజ్జీవం ప్రాజెక్టులను ఏక కాలంలో పూర్తి చేయాలని సర్కారు భావిస్తున్నది. రెండేండ్ల కాలపరిమితితో కూడిన ప్రణాళికతో ఈ ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖను కూడా చూస్తున్న సీఎస్ జోషికి ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మిగిలిన ప్రాజెక్టులను మూడేండ్ల కాలపరిమితిలో పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
రుణాల సేకరణపైనే దృష్టి...
రీడిజైన్ పేరుతో చేపట్టిన ఐదు ప్రాజెక్టులను పూర్తి చేయటానికి బ్యాంకు రుణాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిధుల సేకరణ కోసం కాళేశ్వరం, సాలమూరు ప్రాజెక్టులతో పాటూ సీతారామ, డిండి, ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టుల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు తొలిదశలోనే రూ. 20 వేల కోట్లు రుణం తీసుకోవాటానికి బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకోగా ఇప్పటికే రూ. 13,000 కోట్లు అందచేశారు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. 17,000 కోట్లు రుణంగా తీసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్ర బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ. 25,000 కోట్లు కేటాయించాలని సీఎం నిర్ణయించి గత మూడు బడ్జెట్లలో ఈ మేరకు నిదులు కేటాయిస్తున్నప్పటికీ ఈ నిధులు ఖర్చు కావటం లేదు. పనులు నత్తనడక నడుస్తుండటంతో పాటూ సంక్షేమ పథకాలను నిధుల మళ్లించటమే దీనికి కారణమని తెలుస్తున్నది. తాజాగా చేసిన ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చాలంటే భారీగా నిధులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందువల్లే ప్రాజెక్టుల కోసం బ్యాంకుల ద్వారా రుణాలు సేకరించటానికే ప్రాధాన్య మిస్తున్నది. 2018-19 బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ. 22,488 కోట్లు కేటాయించగా వీటిలో రూ. 6 వేల కోట్లు మాత్రమే ఇప్పటి వరకూ విడుదల చేశారు. మరో 13 వేల కోట్లు బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలను ఖర్చు పెట్టారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు, విద్యుత్ బకాయిలు కలిపి రూ. 5,000 కోట్లు ఇప్పటికిప్పుడు విడుదల చేయాల్సి ఉన్నది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఏఐబీపీ, పీఎంకేఎస్వై కింద మంజూరైన ప్రాజెక్టులకు కూడా నిధులు రావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదలకు సంబంధించిన అంశంతో పాటూ కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవటానికి అనుసరించాల్సి వ్యూహం గురించి కూడా సీఎం సమీక్షలో దిశా నిర్దేశం చేసే అవకాశం ఉన్నది.