Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులకు ఉత్తమ అవకాశాలు
- అవగాహన కల్పించేందుకు టీటా యూఏఈ చాప్టర్ సిద్ధం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన వీసా విధానంతో విద్యార్థులకు ఉత్తమ అవకాశాలు లభిస్తాయని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) యూఏఈ చాప్టర్ అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న నరేష్ కుమార్ అళ్లూరు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంజినీర్లు, టెకీలకు యూఏఈ అవకాశాల వేదిక అని పేర్కొన్నారు. నూతన వీసా విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు టీటా యూఏఈ చాప్టర్ సిద్ధమని తెలిపారు. యూఏఈ టెక్నాలజీకి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఐటీరంగంలో ఇప్పటి వరకు ఉన్న సాంకేతిక అంశాలతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి అత్యాధునిక విధానాలనూ డ్రైవర్ లెస్ కార్స్, టాక్సీలు వంటి అధునాతన సేవలు ఆ దేశంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. యూఎస్, యూకే తరహాలో యూఏఈలో వృత్తిపరంగా ఎదిగేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు యూఎస్, యూకేలో ఉన్నత విద్యాభ్యాసం ఆలోచనలు చేస్తున్నప్పటికీ యూఏఈవైపు ఆసక్తి చూపించొచ్చని తెలిపారు. అమెరికాతో పోలిస్తే ఉన్నత విద్య ఖర్చు తక్కువనీ, దీనికి తోడుగా యూఏఈ ప్రభుత్వం ఔట్స్టాండింగ్ విద్యార్థులకు పదేండ్ల వీసా సౌకర్యం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. విద్యాభ్యాసం చేసిన అనంరం ఉద్యోగ అవకాశాలు సైతం మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. డిజిటల్ మార్కెటింగ్, కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి అంశాల్లో ఈ అవకాశాలున్నాయని పేర్కొన్నారు. యూఏఈ టెక్నాలజీ ఆధారిత ఈవెంట్లు జరుగుతాయని తెలిపారు. అదే తరహాలో హైదరాబాద్లో నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. టీటా యూఏఈ ఇతర స్థానాలకు భరద్వాజ్, వంశీ, పరమేశ్వర్, ప్రదీప్, తేజస్విని, అరవింద్ పోటీచేస్తున్నారని తెలిపారు.