Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా తీర్పును శిరసావహిస్తాం: లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి సమిష్టి బాధ్యత ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె లక్ష్మణ్ అన్నారు. ఒక్కరే గెలిచినా కుంగిపోయేది లేదనీ, ప్రజా తీర్పును శిరసావహిస్తామనీ చెప్పారు. శనివారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని అన్నారు. ఓటమికి గల కారణాలను పూర్తిస్థాయిలో విశ్లేషిస్తామని చెప్పారు. చంద్రబాబు, కేసీఆర్ మధ్య ఈ ఎన్నికలు జరిగాయన్నారు. తెలంగాణ అనుకూలురు, వ్యతిరేకుల మధ్య ఎన్నికలు జరగడంతో టీఆర్ఎస్ గెలిచిందని చెప్పారు. కుమార పట్టాభిషేకం ఇప్పుడే అయ్యిందనీ, ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామనీ అన్నారు.
24న రాష్ట్రానికి అమిత్షా
ఈనెల 24న బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్షా వస్తున్నారనీ లక్ష్మణ్ అన్నారు. వచ్చేనెల మొదటి వారంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వస్తారని వివరించారు. రానున్న లోక్సభ ఎన్నికలకు శ్రేణులకు దిశానిర్దేశం చూపేందుకు వస్తున్నారని చెప్పారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా ఈనెల 24న అమిత్షా సమీక్ష చేపడతారని అన్నారు. ఈనెల 15,16 ఏదీల్లో ఢిల్లీలో అన్ని మోర్చాల సమావేశాలు జరుగుతాయని చెప్పారు. వచ్చేనెల 11,12 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ఢిల్లీలో జరుగుతాయనీ, పార్లమెంటు ఎన్నికలకు పార్టీ అనుసరించే కార్యాచరణను ప్రకటిస్తుందని అన్నారు.