Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలుగుదేశం తెలంగాణ శాఖలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వంపై ఒకింత ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ముందస్తు ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు బెడిసికొట్టడంపై తీవ్ర చర్చ జరుగుతున్నది. ఎన్నికల ఫలితాలు వచ్చి సర్కారు ఏర్పడ్డా, పార్టీని నైరాశ్యాన్ని వీడకపోవడంపై రకరకాల అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ నాయకత్వం తమ అవసరాల కోసమే తెలంగాణ శాఖను బలిచేసిందనే విమర్శలు వస్తు న్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే తెలంగాణ శాఖ నేతలు, కార్యకర్తల భవిష్యత్ను పణంగా పెడతారా ? అంటూ ఆగ్రహం పెల్లుబుకుతున్నది. మహాకూటమి పేరుతో ఎన్నికల బరిలో వెళ్లినప్పటికీ, కాంగ్రెస్లో సరైన ప్రణాళిక లేక చతికిలపడ్డామని అంటున్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పనలోనూ, అభ్యర్థులను ప్రకటిం చడంలోనూ చోటుచేసుకున్న జాప్యం మరో ఐదేండ్ల పాటు అధికారానికి దూరంగా ఉండేలా చేసిందని, తీవ్ర మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కూటమికి ప్రాధాన్యత ఇచ్చినా, కాంగ్రెస్ నుంచి సమయానుకూలంగా వ్యూహరచన చేయడంలోనూ, దాన్ని అమలుచేయడంలోనూ చురుకైన నేత లేకపోవడం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలోని వ్యక్తి ఒకరు వ్యాఖ్యానించారు. టీడీపీకి ఎన్ని సీట్లు అడిగారు, ఏమేమీ అడిగారు అనే సంగతి కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం , ఆఫీసు బేరర్లకు కూడా చెప్పలేదని అంటున్నారు.
అనవసరంగా కూటమి ప్రయోజనాల దృష్ట్యా అంటూ ఎక్కువ సీట్లు కాంగ్రె స్కు వదిలేయడం మూలంగా పార్టీలోని నాయ కత్వాన్ని నిర్లక్ష్యం చేసినట్టయిందని వాపోతున్నారు. రెండు వారాలుగా రాష్ట్ర నాయకత్వం హైదరాబా ద్లోని ఎన్టీఆర్ భవన్ గడప తొక్కడం లేదనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలిచేవరకు అఫీసు వచ్చేది లేదని భీష్మించుకూర్చు న్నట్టు సమాచారం. 14 సీట్లు అని చెప్పి, 13 సీట్లకే భీపారాలు అందించడం, చివరకు 12 సీట్లల్లోనే అభ్యర్థులు పోటీ దిగడం పట్ల నేతల్లో పార్టీ నాయకత్వం మెతక వైఖరీని తప్పుబడుతున్నారు.ఇందులో కాంగ్రెస్ అత్యుత్సా హాన్ని ప్రదర్శించి బోల్తాపడిందనే విమర్శలు టీడీపీ నుంచి వస్తు న్నాయి. 12 నియోజకవర్గాలకుగాను ఇబ్రహీం పట్నంలో కాంగ్రెస్ బీఎస్పీకి మద్దతు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు.కాంగ్రెస్ తమ బలాన్ని తాను ఎక్కువగా అంచనా వేసుకుందని, అదే తరుణంలో టీడీపీ సైతం తన శక్తిని అతిగా ఊహించుకుందనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. చివరకు రెండే రెండు సీట్లకు టీడీపీ పరిమితం కావాల్సి వచ్చిందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెంటనే సమీక్ష చేసి, పార్టీకి దిశానిర్దేశం చేయాల్సి ఉందని పార్టీలో కీలకంగా ఉన్న ఒక నేత అన్నారు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్నవారిని గుర్తించకపోవడం పట్ల టీడీపీలో ఆగ్రహం వ్యక్తమవుతుండటం గమనార్హం.