Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ని నిలువరించిన అక్రమ కేసులు
- గిరిపుత్రులకు నమ్మకం కలిగించని కేసీఆర్ హామీ
- ఏజెన్సీ మండలాల్లో కారుకు పరాభవం
'అడవిపై గిరిజనులకు ఎలాంటి హక్కూలేదు.. పచ్చని అడవులను నరికి అటవీ విస్తీర్ణాన్ని తగ్గిస్తే చూస్తూ ఊరుకోం.. పోడు నరికితే కఠిన చర్యలే.. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని అడవులను పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే హరితహారం పథకాన్ని అమలు చేస్తున్నాం..' ఇవి సీఎం కేసీఆర్ 2014 ఎన్నికల అనంతరం శాసనసభలో మాట్లాడిన మాటలు.
నవతెలంగాణ-ఖమ్మం ప్రతినిధి
'పోడు రైతులు దొంగలు కారు.. పొట్టకూటి కోసమే వారు పోడు నరుక్కుని బతుకీడుస్తున్నారు.. వారికీ రైతుబంధు, రుణమాఫీ, హక్కు పత్రాలు, రైతుబీమా పథకాలు అందాల్సిన అవసరం ఉంది. అందుకే ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన ఆరునెలల్లో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాల్లోని పోడు రైతులకు అండగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుంది. ఈ కీలక పథకానికి నేనే సీఎం హోదాలో జిల్లాకు రెండు రోజుల పాటు కేటాయించి అటవీ శాఖ మంత్రి, సీఎస్, అటవీశాఖ ముఖ్యకార్యదర్శితో కలిసి పోడు భూముల సమస్యకు చెక్పెడతా' ఇవీ ఇటీవల ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ మాటలు. ఇన్నాళ్లూ పోడు రైతులపై నిర్బంధాలు ప్రయోగించిన సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ఇలా మాటమార్చడం వెనుక.. పోడు రైతుల ఓట్ల కోసమేననేది తెలియంది కాదు. అందుకే గిరిపుత్రులు ఏమాత్రం కేసీఆర్ మాటలను విశ్వసించలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, భూపాలపల్లి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ఎనిమిది నియోజకవర్గాల్లో కారు గుర్తుకు ఓటేయడానికి ముందుకు రాలేదు. చివరికి ఎనిమిది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది.
పోడుపై ప్రభుత్వ వ్యతిరేక తీర్పు...
2014 ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ విస్తీర్ణాన్ని పెంచేదానిలో భాగంగా హరితహారం చేపట్టింది. నాలుగేండ్లలో నాలుగు దఫాలుగా మొక్కలు నాటింది. ఈ సమయంలోనే పోడు రైతులపై అనేక నిర్బంధాలు కొనసాగాయి. పోడు రైతులపై అక్రమ కేసులు బనాయించారు. ముఖ్యంగా అటవీ, రెవెన్యూ, పోలీస్ అధికారుల మూకుమ్మడి దాడులతో అమాయక గిరిజనులు పోడుభూముల్లో అరిగోస పడ్డారు. కేసుల్లో ఇరుక్కుని జైళ్లలో మగ్గారు. కొందరిపై నిర్బంధంగా పీడీ యాక్టులు నమోదు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు విస్తీర్ణం సుమారు 79,184 ఎకరాలుండగా, అటవీ హక్కు పత్రాలు 21,723 ఎకరాలకే అందించారు. ఇంకా గతంలో దరఖాస్తులు చేసుకున్న వారు సుమారు 45వేల మంది వరకున్నారు. వీరికి 2005నుంచీ పోడు హక్కు పత్రాలు అందలేదు. వీటిలో డీఎల్సీ ఆమోదం పొందినవి వేలల్లో ఉన్నాయి. హక్కు పత్రాలున్న వారికి పెట్టుబడి సాయం ఇచ్చినప్పటికీ భూరికార్డుల ప్రక్షాళన సమయంలో అటవీ భూముల పేరుతో వారికి కొత్త పాసుపుస్తకాలు ఇవ్వలేదు. గిరిజనుల తరపున పోడు హక్కుల కోసం పోరాటాలు సాగించిన వామపక్ష నాయకులను సైతం ఇబ్బందులకు గురిచేయడమే కాక, గిరిజనులతోపాటు వారినీ జైళ్లకు పంపారు. అయినా పోడుపోరు నిరంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రగులుతూనే ఉంది.
పోడు ప్రాంతాల్లో కారుకు ప్రతికూలం..
ఉమ్మడి ఖమ్మం జిల్లా, జయశంకర్ జిల్లాలో హరితహారంలో భాగంగా ఆదివాసీ గిరిజన రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను అటవీశాఖ అధికారులు ఆక్రమించుకొని మొక్కలు నాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోడు రైతులు, అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖాధికారుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు, ఘర్షణలు జరిగాయి. భద్రాద్రి జిల్లాలోని 23మండలాల్లోనూ, ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాల్లోనూ పోడు భూములున్నాయి. పోడు భూముల సమస్యలున్న ఎనిమిది నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఆదివాసీలు, గిరిజనులున్న భద్రాచలం, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఖమ్మం జిల్లాలోని వైరా, సత్తుపల్లి, జయశంకర్ జిల్లా ములుగు ప్రాంతాల్లోటీఆర్ఎస్కు పోడు రైతులు ఓటుతో తమ ప్రతికూల తీర్పునిచ్చారు.
పోడు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల వివరాలు...
నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు కాంగ్రెస్కు టీఆర్ఎస్
కొత్తగూడెం 2,12,040 1,73,421 81,118 4139 ఓట్లతేడాతో ఓటమి
భద్రాచలం 1,37,319 1,10,445 47,746 11,785 ఓట్లతేడాతో ఓటమి
పినపాక 1,44,686 1,43,791 72,283 19,565 ఓట్ల తేడాతో ఓటమి
ఇల్లందు 1,96,798 1,62,440 50,688 2654 ఓట్ల తేడాతో ఓటమి
అశ్వారావుపేట 1,43,960 1,26,900 61,121(టీడీపీ) 13,117 ఓట్ల తేడాతో ఓటమి
వైరా 1,76,820 1,26,177 52,650(స్వతంత్ర) 2013 ఓట్ల తేడాతో ఓటమి
సత్తుపల్లి 2,22,711 1,96,905 1,00,044(టీడీపీ) 19,002 ఓట్ల తేడాతో ఓటమి
ములుగు 2,03,830 1,68,00 88971 (కాంగ్రెస్) 22,671 ఓట్ల తేడాతో ఓటమి