Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ సంతాపం
నవతెలంగాణ, హైదరాబాద్
ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు సోదరుడి కుమార్తె చండ్ర రాజకుమారి మృతి పట్ల సీపీఐ రాష్ట్ర సమితి సంతాపం తెలిపింది. రాజకీయ చైతన్యం వెల్లి విరిసిన కుటుంబంలో పుట్టి భారత కమ్యూనిస్టు పార్టీలో చేరి తుది శ్వాస వరకూ ఆవిశ్రాతంగా పోరాడిన యోధురాలిగా సీపీఐ రాష్ట్ర నేతలు ఆమెను అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా, జాతీయ మహిళా సమాఖ్య ఉపాధ్యక్షురాలిగా మహిళల కోసం ఆమె చేసిన కృషిని సీపీఐ నేతలు గుర్తు చేసుకున్నారు. చండ్ర రాజకుమారి మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేం పావని, రాష్ట్ర రైతుసంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ సంతాపం తెలిపారు. గోదావరి జలాలను తెలంగాణ ప్రాంతానికి వినియోగించి సస్యశ్యామలం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుసంఘం చేసిన పోరాటంలో పాల్గొని మద్దతు ప్రకటించిన మహిళా నాయకురాలు రాజకుమారి అని తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆమె మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని వారు తెలిపారు.