Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం రోజుల్లో సమగ్ర ప్రణాళిక తయారు చేయండి
- నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం ఆదేశం
- చిన్న నీటి వనరులపై సమీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
ప్రాజెక్టుల నీళ్లు చెరువులకు చేరే విధంగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. చిన్న నీటి వనరులు, మిషన్ కాకతీయపై ప్రగతి భవన్లో శుక్రవారం ఆయన సమీక్ష జరిపారు. వర్షపు నీరు, పడబాటు నీరు కూడా చెరువులకు మళ్లించే విధంగా ప్రణాళికలు ఉండాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు తెలంగాణ వ్యవసాయానికి శతాబ్ధాల తరబడి ప్రధాన వనరులగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. మిషన్ కాకతీయతో చెరువులకు మళ్లీ పూర్వ వైభవం రావాలని సీఎం ఆకాంక్షించారు. చెరువులన్నీ నిండి కళ కళలాడినప్పుడే మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఒకప్పుడు తెలంగాణలో చిన్న నీటి వనరుల వ్యవస్థ బ్రహ్మాండంగా ఉండేదని, గొలుసు కట్టు చెరువుల కింద అద్భుతంగా పంటలు పండేవన్నారు. ఒక చెరువు అలుగు పోస్తే గొలుసుకట్టులోని మిగిలిన చెరువలన్నీ నిండేవని, నీరు పారేందుకు సహజసిద్ధమైన కాల్వలు ఉండేవని తెలిపారు. జాలువారు నీళ్ళతోనే చెరువులు నిండేవన్నారు. బచావత్ అవార్డు ప్రకారం 1974 లోనే తెలంగాణ చెరువులకు రెండు బేసిన్లలో కలిపి 265 టీఎంసీల నీటి కేటయింపు ఉండేదని చెప్పారు. రాను రాను చెరువులతో పాటూ తెలంగాణ బతుకు నాశనమయ్యిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రూ. లక్షల కోట్లు ఖర్చు పెట్టి 25 లక్షల బోర్డు వేసుకున్నారని ఆయన తెలిపారు. అయినా పంటలు సరిగా పండలేదని, వ్యవసాయం దెబ్బతిన్నదని ఆయన అన్నారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ కార్యక్రమం తీసుకున్నామని, చెరువులను బాగు చేసుకున్నామని చెప్పారు. చెరువులు నీటితో కళ కళలాడితేనే దీనిని సార్థకత లభిస్తుందన్నారు. రాష్ట్రంలో 12,150 గొలుసుకట్టుల్లో 27,800 చెరువులున్నాయని కేసీఆర్ తెలిపారు. గొలుసుకట్టులోని మొదటి చెరువుకు నీరందిస్తే మిగిలిన చెరువులకు కూడా నీరు చేరే విధంగా ఫీడర్ చానల్స్ సిద్ధం చేయాలని ఆదేశించారు. బోర్లు ఎక్కువగా వేయటంతో భూగర్భ జలాలు తగ్గిపోయాయని అందుకే జాలువార్లు లేవని చెప్పారు. చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరుగుతాయని, మళ్లీ జాలువార్లు చూడవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. గొలుసకట్టు చెరువులను పునరుద్ధరించటానికి నీటిపారుదల శాఖ అధికారులకు ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహిం చాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుత సీజన్లోనే అన్ని పనులు ప్రారంభం కావాలన్నారు. రాష్ట్రంలోని ఐబీ, రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్ శాఖల ద్వారా పెద్ద సంఖ్యలో చెక్డ్యాంలను నిర్మిస్తున్నామని తెలిపారు. అన్ని రకాల చిన్న నీటి వనరుల్లో నీటి నిల్వల లెక్కలు తేల్చాలన్నారు. చిన్న నీటి వనరుల పునరుద్ధరణ కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని దీనికి అవసరమైన నిధులను సమకూర్చటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం చెప్పారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మరళీధరరావు, కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు.