Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కార్పొరేషన్ రుణాల లబ్దిదారుల ఎంపిక రద్దు
నవతెలంగాణ-పరిగి
యూనిట్ల పెంపు కుదరదనడంతో ఎస్సీ కార్పొరేషన్ రుణాల లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి ఎంపీడీఓ కార్యాల యం ఎదుట మంగళ వారం ఆందోళన చేశారు. లబ్దిదారులు తెలిపిన వివరాల ప్రకారం..
2017-18 సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ లోన్ల కోసం మండలంలోని 37 గ్రామ పంచాయతీల నుంచి 505 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. లబ్దిదారుల ఎంపికను పరిగి ఎంపీడీఓ కార్యాలయంలో చేపట్టారు. ఈ మండలానికి 19 యూనిట్లు కేటాయించారు. ఇందులో సగం స్కిల్డ్ కింద, మిగతా సగం అన్స్కిల్డ్ కింద మొత్తం 392 మందిని ఎంపిక చేశారు. స్కిల్డ్ కింద ఎంపికైన వారిని ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారులు ఎంపిక చేస్తారు. అన్స్కిల్డ్ కింద మండలాధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య లబ్దిదారుల ఎంపిక చేస్తారు. అందులో భాగంగానే పరిగి మండలంలో 10 యూనిట్ల కోసం లబ్దిదారులను ఎంపిక చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదట రూ.లక్ష రుణానికి సంబంధించిన ఆరు యూనిట్లను గ్రామాల వారీగా లక్కీ డ్రా తీశారు. అనంతరం రూ.2లక్షలకు పైబడిన మూడు యూనిట్లను మండలం మొత్తం మీద డ్రా తీసేందుకు అధికారులు ముందుకొచ్చారు. కానీ లబ్దిదారులు మూడు యూనిట్లు సరిపోవని ఆందోళనకు దిగారు. గ్రామాల వారీగా యూనిట్లు తీయాలని కోరారు. అలా తీయడానికి వీలుపడదని అధికారులు చెప్పడంతో లబ్దిదారులు ఎస్సీ కార్పొరేషన్ లోన్లను బహిష్కరిస్తున్నామంటూ బయటకొచ్చి ఆందోళన చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఎంపీపీ జ్యోతితో మాట్లాడి అభ్యర్థుల ఎంపికను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో లబ్దిదారులు ఆందోళన విరమించారు.