Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని స్థానాల్లోనూ బరిలో..
- మంత్రివర్గంలో మళ్లీ అన్యాయమే: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి
నవతెలంగాణ-యాదాద్రి భువనగిరి ప్రతినిధి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ(ఎం)తో కలిసి పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రకటించారు. మంగళవారం యాదాద్రి భువనగిరిలో నిర్వహించిన ఆ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములుతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలో పెట్రేగిపోతున్న మతోన్మాదులను అణగదొక్కడానికి వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అందులో భాగంగానే సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో చర్చలు జరిపినట్టు తెలిపారు. ఆ పార్టీ తమతో కలిసి వస్తే మిగతా వామపక్షాలను ఏకం చేసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలతో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల విషయమై చర్చించలేదన్నారు. మార్చి వరకు వేచి చూసి ఆ తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటిం చారు. రాష్ట్రంలో తాము బలంగా ఉన్న అన్నీ పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసి అప్పటి ప్రధాని నెహ్రూ కంటే అత్యధిక ఓట్లు సాధించిన ఘనత తమ పార్టీ నాయకుడు రావి నారాయణరెడ్డికి ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ రెండోసారి విస్తరించిన మంత్రి వర్గంలో మహిళలకు చోటు ఇవ్వకపోవడం వివక్షకు నిదర్శనమన్నారు. కేసీఆర్ కపటనీతిని ఇప్పటికైన మహిళా లోకం గ్రహించాలని కోరారు. ఆర్మూర్లో మద్దతు ధర కోసం రోడ్డెక్కిన పసుపు, ఎర్రజొన్న రైతులపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.