Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాల్రావు
- బడుగులపై సర్కారు చిన్న చూపు
- 50 శాతానికి మించి ఖర్చు కాని సబ్ప్లాన్ నిధులు
- దీర్ఘకాలిక ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాస్వామ్యం అపహాస్యం చేసుకునే విధంగా దళిత సంక్షేమం ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాల్రావు ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల సమస్యలు.. సమస్యలు కావా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఏర్పడిందని, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులకు కూడా ముఖ్యమంత్రి అందుబాటులో ఉండలేని పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో '' ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు'' అనే అంశంపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధి అమలు పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గోపాల్రావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి దళిత సంక్షేమానికి పాటుపడాలన్న ఆలోచన లేదని విమర్శించారు. అంకెల్లోనే దళితుల అభివృద్ధి కనిపిస్తున్నదని, కానీ వాస్తవ అభివృద్ధి జాడేలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు కేటాయించిన నిధుల్లో సగం నిధులను కూడా ఖర్చు చేయకపోవడం బాధాకరమన్నారు. గత ఐదేండ్లలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధి పథకం కింద రూ. 68,585 కోట్ల నిధులు కేటాయిస్తే అందులో కేవలం రూ.30,247 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం ఇందుకు ఉదహరణ అని చెప్పారు. అందులోనూ ఎస్సీల అభివృద్ధికి 20 శాతం నిధులకన్నా ఎక్కువ ఖర్చు చేయలేదని తెలిపారు. గత మూడున్నర సంవత్సరాలుగా సంక్షేమ శాఖలో ఇన్చార్జీల పాలనే కొనసాగుతున్నదని, శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు చేపట్టడం లేదన్నారు. దళిత సంక్షేమ శాఖకు ముఖ్య కార్యదర్శి కూడా లేకపోవడం గమనార్హమన్నారు.
ఉద్యమాలతోనే పరిష్కారం
దీర్ఘకాలిక ఉద్యమాలతోనే దళితుల సమస్యలు పరిష్కారమవుతాయని గోపాల్రావు అభిప్రాయపడ్డారు. సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు దళిత సంఘాలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలతోనే సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెలుతాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ చట్టాల గురించి గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యపర్చాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధి అమలు పర్యవేక్షణ కమిటీ కన్వీనర్ పి శంకర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి చట్టం 2017ను తెచ్చామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు గొప్పలు చెబుతున్నప్పటికీ తాను తెచ్చిన చట్టాన్ని అమలు చేయలేని దుస్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. చట్టంలో పేర్కొన్న విధంగా 31 సెక్షన్లలో పాలకులకు అనుకూలంగా ఉన్న కొన్ని సెక్షన్లను మాత్రమే అమలు పరుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల పట్ల జవాబుదారితనం ఉంటే సబ్ప్లాన్ నిధుల వివరాలను పబ్లిక్ డోమైన్లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక నిధి చట్టాన్ని అమలు పరిచేందుకు ప్రత్యేకమైన పథకాలు రూపొందించాలని ప్రత్యేకాభివృధ్ధి నిధి చట్టంలో పేర్కొన్నారని, కానీ నేటికి ఏఒక్క పథకం కూడా దళితులు నేరుగా ప్రయోజనం కలిగే పథకాలను రూపొందించలేదన్నారు. మాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభిభివృద్ధి నిధికి సంబంధించిన ఖర్చులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వార్షిక బడ్జెట్లో ప్రత్యేకాభివృద్ధి నిధిపై ప్రత్యేకంగా రెండు రోజులు అసెంబ్లీలో చర్చించాలన్నారు. పకడ్బందీగా చట్టం అమలు చేసేందుకు స్టేట్ కౌన్సిల్ కమిటీ, నోడల్ ఏజెన్నీ, జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలలో ఐదుగురు నాన్ అఫిషియల్ మెంబర్లను నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో డీపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎడొండ స్వామి, విద్య సామర్ధ్యాల సాధన ఉద్యమం నేత ప్రకాశ్, డీబీఎఫ్ రాష్ట్ర నాయకులు చంచురాజేందర్ తదితర దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.