Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పులే రాష్ట్రాలకు ప్రధానమైన సవాల్:పదిహేనో ఆర్థిక సంఘం చైర్మెన్ ఎన్కే సింగ్
- మిషన్ భగీరథ, రైతుబంధుకు కితాబు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 'ఆదాయ మిగులు'ను కాగ్ రిపోర్టు ప్రశ్నించిందని పదిహేనో ఆర్థిక సంఘం చైర్మెన్ ఎన్కే సింగ్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి రాష్ట్రంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.5,392 కోట్ల రెవెన్యూ లోటుందని ఆయన తెలిపారు. కమిషన్ సభ్యులతో కలిసి రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్, ఇతర మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథ, రైతుబంధు తదితర పథకాలను ప్రశంసించారు. టీఎస్ ఐపాస్ విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులనివ్వటం (సింగిల్ విండో విధానం) అద్భుతమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2015-16, 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో రెవెన్యూ మిగులును చూపించిందని అన్నారు. రాష్ట్ర మూలధన వ్యయ వృద్ధిరేటు 2015-16 నుండి 2017-18 వరకు 27 శాతంగా ఉందని తెలిపారు. ప్రారంభ నెలల్లో మినహాయించి, రాష్ట్రం ఎలాంటి జీఎస్టీ పరిహారాన్ని పొందలేదన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలో ద్రవ్యలోటు 2015-16 నాటికి జీఎస్డీపీలో 3.26 శాతంగా నమోదైతే.. 2016-17 నాటికి 5.35 శాతానికి పెరిగింది. అంతేకాకుండా, 2016-17 నాటికి రూ.7,500 కోట్లకు బదిలీ అయిన మొత్తం ద్రవ్యలోటు 4.22 శాతంగా నమోదైంది. అయితే, ఆర్థిక లోటు 2017-18లో 3.12 శాతానికి పడిపోయిందన్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్, సంగారెడ్డి జిల్లాలు రాష్ట్ర జీఎస్డీపీలో 52 శాతం వాటాను కలిగున్నాయని తెలిపారు. మిగతా జిల్లాల వాటాల శాతాన్ని పరిశీలిస్తే సాధారణ సగటు కంటే తక్కువగా ఉందని చెప్పారు. అందువల్ల ఈ నాలుగు జిల్లాలకు.. మిగతా జిల్లాలకు మధ్యనున్న అంతరాన్ని తగ్గించాలని సూచించారు.
ప్రతీ రాష్ట్రానికి అప్పులే ప్రధానమైన సవాలని ఎన్కే సింగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వీటితోపాటు ద్రవ్యలోటును అధిగమించేందుకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా వ్యూహాలు రచించుకోవాలని అన్నారు. వాస్తవికత దృక్కోణంతో ఆలోచించాలని సూచించారు. ఇదే సమయంలో ఎఫ్ఆర్బీఎమ్ పరిమితిని దృష్టిలో ఉంచుకుని అప్పుల విషయంలో ఆచితూచి అడుగేయాలని రాష్ట్రాలకు సూచించారు.
అన్ని విషయాల్లోనూ విశ్వసనీయత, జవాబుదారీతనాన్ని పెంచటం ద్వారా ప్రభుత్వాలు పారదర్శకతను ప్రదర్శించాలని కోరారు. ముఖ్యమంత్రితోపాటు ఇతర రాజకీయ పార్టీలతో సమావేశం సందర్భంగా వచ్చిన విజ్ఞప్తులను కేంద్రానికి సిఫారసు చేస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర పథకాలు, కార్యక్రమాల అమలు, అప్పుల విషయాల్లో మీరు కాగ్ రిపోర్టును ప్రాతిపదిగ్గా తీసుకుంటారా..? లేక ప్రభుత్వ రిపోర్టునే పరిగణనలోకి తీసుకుంటారా..? అని 'నవతెలంగాణ' ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు.