Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నం...పప్పు..నీళ్లు ..అన్నింట్లోనూ..
- వస్తువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు
- నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేటి ఆధునిక సమాజంలో కల్తీ రాజ్యమేలుతున్నది.. అన్నంలో.. సున్నంలో.. పప్పులో.. ఉప్పులో.. నీళ్లలో.. పాలలో..ఆఖరు తాగే నీళ్లలో కూడా ఇలా అన్నింట్లో కల్తీదే ప్రధాన పాత్ర.. టీ పొడిలో రంపం పొట్టు.. మిర్యాలలో పొప్పడికాయ గింజలు.. కందిపప్పులో కేసరిపప్పు.. కాఫీ పొడిలో చింతగింజల పొడి.. పాలలో గంజినీళ్లు.. కలుపుతున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వీటికి తోడూ నకిలీ వస్తువుల ఉత్పత్తి గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుత బహిరంగ మార్కెట్లో 70 శాతం మేర కల్తీ జరుగుతున్నదని వ్యాపార వర్గాలే ఆందోళన పడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కల్తీకి అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో చైతన్యమే ముఖ్యమని వినియోగదారుల ఫోరం భావిస్తున్నది. ఈ కల్తీని నివారించాలంటే ప్రతి ఒక్కరిలో అవగాహన రావాలంటున్నారు. శుక్రవారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 'నవతెలంగాణ' అందిస్తున్న ప్రత్యేక కథనం..
ప్రస్తుత సమాజంలో సామాన్య పౌరుల నుంచి బడా వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక వస్తువును కొనుగోలు చేస్తుంటారు. విలువైన ప్రభుత్వ, ప్రయివేటు సేవలను పొందుతుంటారు. ఈ వర్గాలకు చెందిన ప్రతిఒక్కరూ వినియోగదారుడి కిందకే వస్తారు. బ్యాంకు ఖాతాదారుడు, రియల్ ఎస్టేట్, లక్కీ లాటరీల కొనుగోలుదారులు, ఫైనాన్స్, చిట్ఫండ్, డిపాజిట్స్, పొదుపు చేసేవారు, రుణాలు పొందేవారు, ప్రయివేటు విద్యా సంస్థల విద్యార్థులు, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులు, పాలసీదారులు, సెల్ఫోన్ వాడకందార్లు, సినిమా ప్రేక్షకులు, గ్యాస్ వాడకందారులు, రైతుల వంటివారిని వినియోగదారులుగానే పరిగణించాల్సి ఉంటుంది. వీరు నిత్యం ఏదో ఒక వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఈ విషయంలో నకిలీల బెడద, నాణ్యతాలోపం వంటి అంశాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే రాష్ట్ర వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుంది.
వినియోగదారుని హక్కులు ఇవి..
వినియోగదారుల చట్టం 1986 ప్రకారం ప్రతి వినియోగదారుడికి ప్రభుత్వం ఎనిమిది హక్కులను కల్పించింది. భద్రతాహక్కు, సమాచారం పొందేహక్కు, ఎంపిక చేసుకునే హక్కు, విన్నవించుకునే హక్కు, పరిహారం పొందేహక్కు, విద్యను పొందేహక్కు, ప్రాథమిక అవసరాలను పొందేహక్కు, ఆరోగ్యకరమైన పరిసరాలను పొందే హక్కులు ఉన్నాయి. వస్తువును కొనుగోలు చేసే విషయంలోగాని, వినియోగించుకునే విషయంలోగాని వినియోగదారుడికి పూర్తి స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. అనైతికమైన పద్ధతుల ద్వారా వివిధ రూపాల్లో దోపిడీ చేస్తున్న వ్యాపారుల నుంచి వినియోగదారుని కాపాడేందుకే ఈ చట్టం ఉందనే విషయాన్ని వినియోగదారులు గ్రహించాలి. వినియోగదారుల ఫోరం ద్వారా మనకు జరిగిన నష్టాన్ని తిరిగి పొందవచ్చు. జిల్లా ఫోరంలో ఒక లక్ష నుంచి 20 లక్షల వరకు, రాష్ట్ర ఫోరంలో 20 లక్షల నుంచి కోటి వరకు, జాతీయ ఫోరంలో ఒక కోటి నుంచి ఆ పైన నష్టపోయిన వినియోగదారుడు కేసు వేసి న్యాయం పొందవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఫోరం ఫీజు లక్షకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రమాణాలు ఇలా గ్రహించాలి
మనం కొనుగోలు చేసే వస్తువులపై ప్రభుత్వం ప్రత్యేక ప్రమాణాలను పొందుపర్చాలని ఆయా సంస్థలకు సూచించింది. ఇందులో భాగంగానే 1987లో వినియోగదారులపై శ్రద్ధ పేరుతో ధ్రువీకరణ ముద్రను ప్రవేశపెట్టింది. ప్రతి వస్తువుపై ఐఎస్ఐ, ఎఫ్పీఓ, అగ్మార్క్, పాల్మార్క్ వంటి ముద్రలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. వినియోగదారులు ఈ విషయాలను గమనించాలి. అదేవిధంగా గ్యారంటీ, వారంటీ కార్డులతోపాటు ఒరిజినల్ రశీదులను పొందే విధంగా జాగ్రత్తపడాలి. వస్తువులు ప్యాకింగ్పై ఉండే ధర, పరిమాణం, కాలం చెల్లే తేదీ, తూనిక రాళ్లపై అధికారుల ముద్రలు, టీవీల్లో, వార్తా పత్రికల్లో, రేడియోల్లో వచ్చే వాణిజ్య ప్రకటన వివరాలను పరిగనలోకి తీసుకోవాలి.
డాక్టర్ నిర్లక్ష్యానికి రూ. 5.50 లక్షల జరిమానా
హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అనారోగ్యం, మనోవేదనకు గురైన బాధితురాలికి పౌరసరఫరాల వినియోగదారుల సలహా కేంద్రం అండగా నిలిచింది. మూడు నెలల్లో ఉచితంగా కేసును పరిష్కరించి ఆ డాక్టర్ నుంచి బాధితురాలికి రూ. 5.50 లక్షల నష్ట పరిహారాన్ని ఇప్పించింది. ఇటీవల పౌరసరఫరాల భవన్లో పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి అకున్ సబర్వాల్ నష్ట పరిహారాన్ని బాధితురాలికి అందజేశారు. ఈ కేసు విషయానికి వస్తే... హైదరాబాద్లోని సైదాబాద్లో నివసిస్తున్న మరియా డిసెంబర్ 2017 గర్భం దాల్చింది. అప్పటి నుండి ఒక ప్రముఖ ఆస్పత్రికి చెందిన డాక్టర్ దగ్గర ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మరియాకు ప్రతి నెల పరీక్షలు నిర్వహించి డాక్టర్ వైద్యం అందించేవారు. ఇదే ఆస్పత్రిలో 2018 సెప్టెంబర్ 27న ఆమెకు ప్రసవం జరిగింది. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రసవం సమయంలో మరియాకు తీవ్ర రక్తస్రావం జరిగింది. అది గమనించిన డాక్టర్లు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుతూ బాధితురాలు అనారోగ్యానికి గురైందని కుటుంబ సభ్యులకు చెప్పి వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు కుటుంబ సభ్యులు మరియా సబా ఫెర్నాండేజ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు ఆమెను ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడం, అలాగే యూరిన్, మోషన్ ప్యాసేజ్ తీవ్రంగా దెబ్బతిన్నదని, తమ వద్ద వైద్యం చేయడం సాధ్యం కాదని తేల్చడంతో బాధితురాలిని బర్కత్పురలోని బ్రిసల్కోన్ ఆస్పపత్రిలో 2018 అక్టోబర్ 3న చేర్పించారు. వారం రోజుల పాటు అక్కడ వైద్యం అందించిన అనంతరం అక్టోబర్ 10వ తేదీన డిశ్చార్జ్ చేసి ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఆ ప్రముఖ అస్పత్రిలో తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన బాధితురాలి భర్త రాష్ట్ర పౌరసరఫరాల వినియోగాదరుల సలహా, సహాయ కేంద్రాన్ని 2018 నవంబర్ 26న సంప్రదించి ఫిర్యాదు చేశాడు. కేసును పరిశీలించిన వినియోగాదరుల సహాయ కేంద్రం బాధితురాలికి రూ. 5.50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇప్పించడానికి సంబంధిత ఆస్పత్రిని అంగీకరింపజేసింది. వినియోగదారులు టోల్ఫ్రీ నంబర్ 180042500333లో సంప్రదించవచ్చునని అధికారులు తెలిపారు.