Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ కమిషన్ చైర్మెన్ బీఎస్.రాములు
- కార్టూనిజం ఓ కళ : అల్లం నారాయణ
- 'ఐ విట్నెస్ ఆఫ్ యాన్ ఎపోక్' పేరుతో నర్సిం కార్టూన్ల ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నవతెలంగాణ కార్టూన్ ఎడిటర్ నర్సిం గీసిన కార్టూన్లు ఎప్పుడూ ప్రజాపక్షంగానే ఉంటాయని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ బీఎస్.రాములు కొనియాడారు. కార్టూన్, క్యారికేచర్ రంగంలో 35 ఏండ్లుగా రాణిస్తూ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2018 జాతీయ ఉత్తమ కార్టూనిస్టు అవార్డు పొందిన నవతెలంగాణ కార్టూన్ ఎడిటర్ నర్సిం కార్టూన్లను 'ఐ విట్నెస్ ఆఫ్ యాన్ ఎపోక్' పేరుతో కార్టూన్ ప్రదర్శనను తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ రవీంద్రభారతిలోని ఐసీసీఆర్ ఆర్ట్గ్యాలరీలో ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణతో కలిసి బీఎస్.రాములు శనివారం ప్రారంభించారు. అనంతరం తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో రాములు మాట్లాడుతూ...నర్సిం కార్టూన్లు, క్యారికేచర్లు తెలుగు పత్రికారంగంలో ఆదర్శనీయంగా నిలుస్తాయన్నారు. ఆయన కార్టూన్లను సాంస్కృతిక శాఖ పుస్తక రూపంలో తెస్తే బాగుంటుందని అన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. కార్టూనిజం ఓ కళ అని, సమస్యను అర్థం చేసుకుని ఎవరినీ నొప్పించకుండా వ్యంగ్యంగా కార్టూన్లు గీయటం మామూలు విషయం కాదన్నారు. తెలుగు ప్రధాన పత్రికల్లో పనిచేసే కార్టూన్లందరూ నల్లగొండ జిల్లాకు చెందిన వారేనని ప్రస్తావిస్తూ పలు ఉదాహరణలు చెప్పారు. సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ మాట్లాడుతూ..ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి పత్రికల్లో ఎడిటర్గా పనిచేసినప్పుడు నర్సిం కార్టూనిస్టుగా పనిచేశారన్నారు. మామిడి హరికృష్ణ మాట్లాడుతూ చిత్రకారులను, కార్టూనిస్టులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ మధ్యకాలంలో శంకర్ వేసిన కార్టూన్లను ప్రదర్శించామన్నారు. నవతెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య మాట్లాడుతూ...కార్టూన్ అంటేనే ప్రశ్నించేదని, ప్రజల పక్షం వహించేదని అన్నారు. నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టాశేఖర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆర్టిస్టులు, కార్టూనిస్టులు ప్రత్యేకంగా దృష్టిపెట్టి అద్భుత కార్టూన్లను గీస్తూ పత్రికలకు పరిపుష్టి తీసుకొస్తున్నారని కొనియాడారు. తెలంగాణ టుడే ఎడిటర్ కె.శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ..తెలుగు పత్రికా రంగానికి కార్టూనిస్టు నర్సిం అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. ప్రముఖ ఆర్టిస్టు, నేషనల్ అవార్డు గ్రహీత దాసి సుదర్శన్ మాట్లాడుతూ 35 ఏండ్ల నుంచి కార్టూన్లు వేస్తున్న నర్సిం చేతుల నుంచి మరిన్ని అద్భుత కార్టూన్లు జాలువారాలని ఆకాంక్షించారు. ప్రముఖ ఆర్టిస్టు చిత్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు పత్రికల కార్టూనిస్టులు సుభాన్, శంకర్, మృత్యుంజయ, జె. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.