Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్, గూగుల్, షేర్చాట్పై నిఘా
- సుమోటోగా 63 కేసులు నమోదు
- కేటీఆర్తో సహా పలువురికి నోటీసులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలో ఎన్నికల అధికారుల కండ్లు గప్పేందుకు ఆయా రాజకీయ పార్టీలు.. నేతలు ఎన్నో ఎత్తుగడలు వేస్తుంటారు. ''కోడ్'' కంటికి దొరకకుండా దారులు వెతుకుతుంటారు. కానీ ఎన్నికల కమిషన్ వారి ఎత్తులకుపై ఎత్తులు వేస్తున్నది. ఎప్పటికప్పుడు వారి కదలికలపై నిఘా పెడుతున్నది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 51 ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఉల్లంఘనను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది.
సోషల్ మీడియాపై కన్ను
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటూ సదరు పార్టీలపై జుగుప్సాకరమైన రీతిలో పోస్టింగ్లు చేస్తున్నారని కమిషన్ భావిస్తున్నది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సోషల్ మీడియాను ప్రధాన ప్రచారాస్త్రంగా రాజకీయ పార్టీలు ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటం, సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు సరైన వ్యవస్థ, సాంకేతికపరిజ్ఞానం లేకపోవడంతో ఎన్నికల కమిషన్ సదరు సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో సోషల్ మీడియాను పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రయివేటు కంపెనీతో ఒప్పందం చేసుకున్నది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోనే సామాజిక మాద్యమాల్లో వస్తున్న ప్రకటనలు, రాజకీయ విశ్లేషణలు, నేతల ప్రకటనలపై దృష్టి పెట్టింది. అందులో ఇతర పార్టీలు, పార్టీల అభ్యర్థులపై చేస్తున్న ఆరోపణలపై నిఘా పెట్టింది. ప్రధానంగా ''ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్ యాప్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందులో వస్తున్న రాజకీయ ప్రకటనలను క్లిప్పింగ్ల రూపంలో ఫైల్ చేస్తున్నది. వాటిలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసిన సదరు వ్యక్తులు, ఆయా సోషల్ మీడియా యాజమాన్యాలపై వచ్చిన అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ ''సుమోటో''గా తీసుకుని వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తున్నది. ప్రీసర్టిఫైడ్ సర్టిఫికెట్ లేకుండా సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం, అభ్యర్థులపై ఆరోపణలు చేసిన సంస్థలపై మీడియా మానిటరింగ్ కమిటీ పలు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వాటికి సమాధానం ఇవ్వని యాజమాన్యాలపై కేసులు నమోదు చేయనున్నది. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్, షేర్ఛాట్ సంస్థలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
పెయిడ్ న్యూస్పై కూడా..
చెల్లింపు ప్రాతిపదికపై ఇచ్చే రాజకీయ ప్రకటనలపై కూడా ఈసీ దృష్టి పెట్టింది. ఎంసీఎంసీ అనుమతి లేకుండా రాజకీయ ప్రకటనలు, వార్తలు ప్రచురించిన మీడియా సంస్థ ల యాజమాన్యాలకు కూడా నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. పత్రికలు, టివీ చానెళ్లు సామాజిక మాద్య మాల్లో రాజకీయ ప్రకటనలకు మీడియా మానిటరింగ్ కమిటీ అనుమతి తప్పని సరి చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కేటీఆర్తో సహా పలువురికి నోటీసులు
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి సామాజిక మాద్యమాల్లో పోస్టులు చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే ఫేస్బుక్లో కోడ్కు విరుద్ధంగా పోస్టింగ్లు పెట్టినందుకు గాను కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్రెడి,్డ సీనియర్ నేత దాసోజు శ్రావన్తో పాటు పలువురు బీజేపీ నేతలకు కూడా ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది.
సోషల్ మీడియాలో నియంత్రణ ఉండాలి: పలు సంఘాల విజ్ఞప్తిల
సోషల్ మీడియాలో నియంత్రణ ఉండాలని కోరు తూ పలు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధాన అదికారి అమ్రాపాలిని శనివారం సచివాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోబపెడుతున్నాయని వారు ఆరోపించారు. కులం, మతం పేరుతో ఒటర్లను ప్రభావితం చేయడమే కాకుండా అవాస్తవాలను కూడా ప్రచారం చేస్తున్నాయిన చెప్పారు. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో ప్రజలు తెలుసుకోలేక గందరగోళానికి గురవతున్నారని వివరిం చారు. ఇప్పటి వరకు అమెరికా, ఉత్తరప్రదేశ్లోనే సోషల్ మీడియా ద్వారా రాజకీయ పార్టీలు చేసిన వ్యవహారం తేటతెల్లమైందన్నారు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం విపరీతంగా పెరిగిందన్నారు.
ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నాయని వారు ఫిర్యాదు చేశారు. మహిళలు, యువత అనేక ప్రలోభాలకు గురవుతున్నారని తెలిపారు. ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వచ్చే ప్రత్యేక ఆకర్షణల ద్వారా ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. కొంత మేరకైనా నియంత్రణ ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని వారు ఎన్నికల కమిషన్కు సూచించారు. కమిషన్ కలిసిన వారిలో ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి కిరణ్చంద్ర, స్వేచ్ఛ-ప్రతాప్రెడ్డి, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ -మోహన్ రాయుడు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్,తెలంగాణ రాష్ట్ర కమిటీ- కె. పార్థసారధి, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా- వెంకట్రామయ్య, హైదరాబాద్ కలెక్టివ్- మోహన్, తెలంగాణ మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటీవ్స్ యూనియన్-ముకుంద్ కులకర్ణి, నాబార్డు బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ -కైలాస్పతి, హ్యూమన్ రైట్స్ ఫోరం- మాధవరావు, చందనా చక్రవర్తి తదితరులున్నారు.