Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోదాడలో ఆటోను ఢీ కొట్టిన సిమెంట్ లారీ
- ఏడుగురు దుర్మరణం.. మరో ముగ్గురి పరిస్థితి విషమం
- మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు
- శ్రీరామనవమికి వెళ్లొస్తుండగా ప్రమాదం
నవతెలంగాణ-కోదాడ
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరామ నవమి వేడుకలకు వెళ్లొస్తుండగా పెనువిషాదం సంభవించింది. దైవదర్శనం చేసుకుని బయల్దేరిన కొద్దిసేపటికే మృత్యువు వారిని కబళించేసింది. బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని గమనించని డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏడుగురు నిండు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్రోడ్డు వద్ద సిమెంట్ లారీ ఢీ కొని ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. మరో ముగ్గురు విషమంగా ఉన్నారు. కోదాడ పట్టణంలోని ఒకే అపార్ట్మెంట్లో నివసిస్తున్న కొంతమంది తమ్మర గ్రామంలోని రామాలయానికి వెళ్లి శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన అబ్బాస్ (55) ఆటోలో పట్టణానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం క్రాస్రోడ్డు వద్దకు చేరుకోగానే ముందున్న బస్సును అతివేగంతో ఓవర్టేక్ చేయబోయాడు. ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని గమనించకపోవడంతో అదేవేగంతో నేరుగా లారీని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో డ్రైవర్ అబ్బాస్(55), బేతు నాగసులోచన (50) లక్ష్మయ్య (60) దంపతులు, సుగుణ (45), పద్మ (50) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలైన సైదమ్మ, శైలజ, మంగతాయారు, లక్ష్మి, రేణుకలను పట్టణంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో సైదమ్మ (40), వట్టికొండ శైలజ (40) మరణించారు. గాయపడ్డ ముగ్గురి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరార య్యాడు. లారీ, ఆటో రెండూ అతివేగంగా ఉండటంతో ఆటో నుజ్జు నుజ్జయ్యింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో రోడ్డంతా రక్తపు మరకలతో బీతావాహంగా మారిపోయింది. విషయం తెలుసుకు న్న స్థానిక సీఐ శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్ల య్యయాదవ్ చేరుకుని, ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అత్యాశే ప్రమాదానికి కారణమా..?
స్థానికంగా రెండో భద్రాద్రిగా పేరుగాంచిన తమ్మర రామాలయానికి ప్రతి ఏడాది శ్రీరామనవమి వేడుకలకు భక్తులు వేల సంఖ్యలో హాజరవుతారు. పట్టణం నుంచి తమ్మరకు కేవలం 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండడంతో ఆటోడ్రైవర్లు వీలైనన్ని ఎక్కువసార్లు రాకపోకలు జరిపి అధికంగా సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ కారణంతో అతి వేగంగా ఆటోలను నడుపుతుంటారు. ఘటనకు కారణమైన అబ్బాస్ కూడా అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు : ఎస్పీ వెంకటేశ్వర్లు
ఆటోడ్రైవర్ ముందున్న బస్సును వేగంగా ఓవర్టేక్ చేయబోయాడు. కానీ ఎదురుగా లారీ వేగంగా వస్తున్న విషయాన్ని గమనించలేదు. దీంతో ప్రాణనష్టం తీవ్రంగా వాటిల్లింది. మృతుల వివరాలు తెలుసుకుంటున్నాం. అందరూ కోదాడవాసులేనని తెలిసింది.