Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కంటోన్మెంట్/ ఎడపల్లి
ఇంటర్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో శుక్రవారం జరిగాయి. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ నగరంలోని మారేడుపల్లిలోని కొండారెడ్డి వీధిలో నివాసముండే కావేటి సుధాకర్రావు కుమార్తె లాస్య(18) నల్లకుంటలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ చదివింది. పరీక్షాఫలితాల్లో లాస్య ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన లాస్య పరీక్షల్లో ఫెయియ్యాను.. ఇంకా ఎంసెట్లో మంచి ర్యాంకు రాదేమోనని తండ్రి సుధాకర్రావుకు చెప్పి బాధపడింది. సప్లిమెంటరీలో పరీక్ష రాయొచ్చని ధైర్యం చెప్పాడు. కానీ, గదిలోకి వెళ్లిన లాస్య చీరతో ఉరేసుకుంది. ఒక్కగానొక్క కుమార్తె ఇలా చేసుకోవడంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామానికి చెందిన తోట వెన్నెల(18) బోధన్ పట్టణంలోని ప్రయివేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివింది. అయితే, మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఎలుకల మందు తాగడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని తండ్రి గోపాలక్రిష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు ఎస్ఐ రామానాయుడు తెలిపారు.