Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దశలవారీగా పోరాటం
- అవసరమైతే పెన్డౌన్
- త్వరలో 30 వేల రెవెన్యూ సిబ్బందితో బహిరంగ సభ
- ఓట్ల కోసం రాజకీయ కుట్ర
- ప్రభుత్వ పథకాల సక్సెస్లో రెవెన్యూ పాత్రనే కీలకం
- తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉపేంద్రరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెవెన్యూ శాఖ బలోపేతానికి చర్యలు తీసుకుంటే స్వాగతిస్తామని, అదే సందర్భంలో శాఖను ఎత్తేయాలని చూస్తే పెన్డౌన్కు కూడా వెనుకాడబోమని తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్రరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం నుంచి వీఆర్ఓలంతా వర్క్ టూ రూల్ను ప్రతి ఒక్కరూ పాటించాలని, దశలవారీగా నిర్వహించే పోరాటాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. త్వరలో 30వేల రెవెన్యూ సిబ్బందితో బహిరంగసభను నిర్వహిస్తామని ప్రకటించారు. హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో గల సుందరయ్యవిజ్ఞాన కేంద్రం లో తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఇతర శాఖల్లో విలీనం చేస్తామని లీకులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తోందని ఆరో పించారు. ఇప్పటికే ఆందోళనతో పదుల సంఖ్యలో రెవెన్యూ ఉద్యో గులు గుండెపోటుతో చనిపోయారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి వాదనలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. శరత్ చేసిన ఫోన్కాల్ను రాజకీయంలో భాగంగా వాడుకున్నారని, ఇప్పటికే సమస్యల్లో కూరుకుపోయిన ప్రజల ఆలోచనలను మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఈ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఉన్నతాధికారుల్లో ఎక్కువగా సీఎం తానా అంటే తందానా అనే వారే ఉన్నారని విమర్శించారు. రెవెన్యూశాఖలో ప్రతిపక్షం కనిపిస్తుందా? సీఎం చెప్పిన పనులు చేయలేదా? పథకాలను విజయవంతంగా అమలు చేసింది తాము కాదా? భూ ప్రక్షాళను సమర్ధవంతంగా పూర్తి చేసింది తామేగా? ప్రయివేటుకు అప్పగించిన ధరణి వెబ్సైట్ తప్పులకు తమను బలిపశువులను చేయడం ఎంతవరకు సబబు? తమపై ఎందుకింత కక్షగట్టి ముందుకెళ్తున్నారని సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. తమకు అవినీతిని అంటగట్టి ప్రజల నుంచి దూరం చేసే కుట్రకు సీఎం కేసీఆర్ పూనుకున్నారని, తమపై సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సీఎం తన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ శాఖ పరిరక్షణ కోసం ఇతర ప్రభుత్వ ఉద్యోగులను, మేధావులను కలుపుకుని ముందుకు వెళ్తామని, 10 లక్షల కరపత్రాలను పంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. మేం పాకిస్థాన్ నుంచి రాలేదని, ఇక్కడే పుట్టి..ఇక్కడే పెరిగామని, శత్రువులం కాదని వ్యాఖ్యానించారు. శాఖలోని లోపాలను ముందు సరిచేయాలిగానీ...శాఖనే ఎత్తేస్తామనడం అస్సలు భావ్యం కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నామని, రాష్ట్ర ఏర్పాటులో తమ కృషి కూడా దాగి ఉందన్నారు. ఉద్యోగులు, ప్రజలు వేరుకాదని, ప్రభుత్వానికి రెండు కండ్ల లాంటివారని అన్నారు. ఏడెనిమిది దశాబ్దాల కిందట భూ సర్వే చేశారని, ఇప్పుడు సమగ్ర భూసర్వే ద్వారా రెవెన్యూ రికార్డులను ఆధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి మూడువేల జనాభాకు ఒక రెవెన్యూ కార్యాలయం ఏర్పాటు చేసి వీఆర్వోను నియమించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచి సాంకేతిక టెక్నాలజీని విస్తరించాలని, సిబ్బందికి రెవెన్యూ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగులు ఆయా శాఖల విధులను అదనంగా నిర్వర్తిస్తున్నామని, ఎన్నికల విధుల్లో ఒక్కో వీఆర్వో ఐదు నుంచి 10 వేలు ఖర్చుపెడితే రూ.1500 నుంచి 3 వేలు కూడా రాలేదని చెప్పారు. ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో ఈసీ దృష్టికి సమస్యను తీసుకెళ్తే రూ.3 వేల నుంచి 6 వేల దాకా తమకు అందాయని అన్నారు. హక్కులన్నీ కల్పిస్తే ఉద్యోగ సంఘాల అవసరం ఉండదని, పాలకులు హక్కులను హరించడం వల్లనే సంఘాలు పుట్టుకొస్తున్నాయని వివరించారు. న్యాయ సమ్మత పోరాటం చేసి రెవెన్యూ శాఖను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీవీఆర్ఓడబ్ల్యూఏ ప్రధాన కార్యదర్శి హెచ్.సుధాకర్రావు, కోశాధికారి కోనబోయిన ప్రసాద్, రాష్ట్ర నాయకులు అశోక్ చౌహాన్, పాడెం వరలక్ష్మి, రామజోగమ్మ, కె.రమేష్, తదితరులు పాల్గొన్నారు.