Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య పరికరాల ధరలు తగ్గినా అదే వాత
- పరీక్షల బిల్లులు తగ్గించని కార్పొరేట్ ఆస్పత్రులు
- డాక్టర్ల కమీషన్ పెరిగిందని కుంటిసాకు
- కొరవడిన ప్రభుత్వ నియంత్రణ
- వైద్య పరీక్షలతో రోగుల బెంబేలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రోగి వస్తే చాలు కార్పొరేట్ ఆస్పత్రులు పండగ చేసుకుంటున్నాయి. చికిత్స ప్రారంభించకుండానే పరీక్షల పేరుతో రోగిని ఎంత పిండాలో అంత పిండేస్తున్నాయి. అత్యాధునిక వైద్యం ఎంత అందుబాటులో ఉంటే అంత 'బిల్లు' వాచిపోతోంది. వాస్తవానికి ఒకప్పుడు వైద్య పరీక్షలకు ఉపయోగించే పరికరాల ధరలు కోట్లలో ఉండేవి. అందుకు తగ్గట్టుగానే పరీక్షల బిల్లులు ఉండేవి. ఇప్పుడు కొన్ని వైద్య పరికరాల ధరలు సగానికి తగ్గిపోయాయి. కానీ బిల్లులు మాత్రం దిగిరాకపోగా.. అమాంతం పెరుగుతున్నాయి. పరీక్షల బిల్లులు తగ్గాలి కదా..ఎందుకు పెరుగుతున్నాయి? ఇది అందరికీ కలిగే అనుమానమే! దీనికి ఆయా పరీక్షా కేంద్రాల నుంచి వచ్చే సమాధానం ఒక్కటే.. 1990 నుంచి 2000 సంవత్సరం వరకు 10 శాతం కమీషన్ ఇస్తే వైద్యులు తప్తిపడేవారని, ఇప్పుడు 30 శాతం కమీషన్ ఇచ్చినా సంతప్తి చెందడంలేదని కుంటిసాకులు చెబుతున్నాయి.
హైదరాబాద్లో 1980-85 మధ్య తొలిసారిగా ఎంఆర్ఐ స్కాన్ను ఏర్పాటు చేశారు. అప్పట్లో దాని ధర మిషనరీ, సాఫ్ట్వేర్ కలిపి రూ.10 కోట్ల నుంచి రూ.11 కోట్లు ఉండేది. అప్పట్లో అన్ని చికిత్సలకు ఎంఆర్ఐ సదుపాయం లేదు. కాలక్రమంలో అనేక రకాల రోగాల నిర్ధారణకు ఎంఆర్ఐను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఎంఆర్ఐ మిషనరీ విలువ రూ.5 కోట్లు కాగా సుమారు 40 రకాల సాఫ్ట్వేర్లు వచ్చాయి. ఒక్కో సాఫ్ట్వేర్ విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుంది. అయినప్పటికీ 1980లలో స్కానింగ్కు ఎంత బిల్లు, ఫీజు తీసుకున్నారో దానికంటే పెరిగింది. అప్పట్లో రోజుకు 15 స్కానింగ్లు అయితే ఇప్పుడు రోజుకు 60 చేస్తున్నారు. సిటీస్కాన్ 1985లో రూ.4.5 కోట్లు ఉంటే ఇప్పుడు రూ.1.5 కోట్లకు లభిస్తుంది. అది కూడా సాంకేతికంగా మరింత అభివద్ధి చెందిన మిషనరీలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు 4 స్లైస్ మిషనరీలు రూ.4.5 కోట్లు చేస్తే ఇప్పుడు 140 స్లైస్ ఉన్నవి రూ.1.5 కోట్లకు దొరుకుతున్నాయి. స్లైస్ పెరగడం వల్ల వేగం పెరుగుతుంది. ఒక్క నిమిషానికి 140 ఫ్రేమ్లు తీయడం వల్ల గతంలో 40 నిమిషాలు పట్టే పరీక్షలు ఇప్పుడు 5 నుంచి 7 నిమిషాల్లో పూర్తవుతున్నాయి. దీంతో ఒక మిషనరీపై గతంలో 20 మందికి పరీక్షలు చేస్తే ఇప్పుడు సుమారు 100 మందికి పరీక్షలు చేస్తున్నారు. అయినా రేట్లు మాత్రం తగ్గించలేదు. ఈ రెండు మిషనరీలే కాదు ఆల్టాస్రౌండ్ స్కానింగ్ పరీక్షల పరిస్థితి అదేవిధంగా ఉంది. దీనిపై సీనియర్ వైద్యులను వివరణ అడిగితే గతంలో కన్నా ఇప్పుడు వైద్యుల కమీషన్ పెరిగిందని అదేవిధంగా సిబ్బంది జీతాలు పెరిగాయని, అందువల్ల పరీక్షల రేట్లు తగ్గడం లేదని బుకాయిస్తున్నాయి.
స్టంట్లదీ అదే పరిస్థితి..
గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినప్పుడు అమర్చే స్టంట్లదీ ఇదే పరిస్థితి. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తున్న స్టంట్ల ధరలను నియంత్రించాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం ఆదేశాలను కార్పొరేట్ ఆస్పత్రులు ఏ మాత్రం లెక్కచేయడంలేదు. స్టంట్ల ధరలు కేవలం 8-18 శాతం తగ్గించడం వల్ల రోగులకు భారీ స్థాయిలో నగదు పొదుపు చేసుకునేందుకు సాధ్యం కావడం లేదు. దీంతో స్టంట్లు వేయించుకున్న హద్రోగులు భారీగానే కార్పొరేట్ ఆస్పత్రులకు ఫీజులు చెల్లిస్తున్నారు. కేంద్రం ఆదేశాల ప్రకారం హద్రోగులకు ప్రాణాధారమైన స్టంట్ల ధరలు 'ఏ మేరకు తగ్గాయో' అనే అంశంపై 2017 ఫిబ్రవరిలో జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఓ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆడ్వామెడ్ అనే సంస్థతో సర్వే నిర్వహించింది. దీనిపై ఆ సంస్థ 'స్టంట్ల ధరలు కేవలం 8-18 శాతం తగ్గించడం వల్ల పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదు. ధరల నియంత్రణ రోగులకు భారీ స్థాయిలో నగదు పొదుపు జరగడంలేదు. చివరకు స్టంట్లు వేయించుకున్న బాధితులు భారీగానే ఆస్పత్రి ఫీజు చెల్లిస్తున్నారు.'అని తేల్చింది. అలాగే, గతంలో రూ.90 వేలకుపైగా ఉన్నప్పుడు బైపాస్ సర్జరీకి రూ.2.5 లక్షలు వసూలు చేసేవారు. ఇప్పుడు దాని ధర రూ.లక్ష లోపే. అంతర్జాతీయ కంపెనీలు వీటిని ఈ ధరకు ఆరోగ్యశ్రీ విభాగానికి సరఫరా చేస్తున్నాయని, కానీ బయట వైద్యుల ద్వారా చేయించుకుంటే ఇప్పటికీ కూడా రూ.90 వేలు వసూలు చేస్తున్నారు. కమీషన్ల వల్లే చార్జీలు తగ్గలేదనేది బహిరంగ వాదన. రెండేండ్ల క్రితం ఆదాయ పన్నుశాఖ విభాగపు అధికారులు బెంగళూరులోని వైద్యుల ఇండ్లపై దాడి చేసినప్పుడు కేవలం ఒక వైద్యుడు రూ.200 కోట్లు కమీషన్ల రూపంలోనే అందుకున్నట్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే. అంటే వీరి దోపిడీ ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంతాల నుంచి రోగులు నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులకు నేరుగా రారు. తమకు గ్రామాల్లో పరిచయం ఉన్న ఆర్ఎంపీలు, లేదా పీఎంపీల ద్వారా వెళ్తారు. ఇలా ఒక రోగిని తీసుకొస్తే వారికి అందే కమీషన్ 30 శాతం వరకు ఉంటోంది. ఆ మేరకు ఇవ్వకపోతే ఆర్ఎంపీలు రోగులను తీసుకురావడం లేదని కార్పొరేట్ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇలా ప్రతీ దశలోనూ కమీషన్లు రాజ్యమేలుతుండటంతో రోగులు నలిగిపోతున్నారు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం కూడా దీనికి కారణంగా కనిపిస్తోంది. ఆస్పత్రికి వెళ్లితే 'నాడి' పట్టకుండానే 'టెస్ట్'లు చేయించుకు రమ్మంటున్నారు. ఆ రిపోర్టులు ఉంటేనే డాక్టర్ల అపాయింట్మెంట్ లభిస్తోంది. ఇలాంటి పరీక్ష వల్ల వైద్యులకు కమీషన్లు అందుతాయని అందరికీ తెలిసిందే! అయితే ఆ కమీషన్లు ఒక రేంజ్లో ఉంటున్నాయని బెంగుళూరు ఐటీ దాడుల్లో బయటపడింది. ఒకవైపు వైద్య పరీక్షల పరికరాల రేట్లు తగ్గుతున్నా బిల్లులు, ఫీజులు భయపెడుతుండటంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోగులను పిండే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.