Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖరీఫ్లో చెరువులన్నీ నిం పుతాం
- నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-ధర్మారం రూరల్
కాళేశ్వరం ప్రాజెక్టులోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం వద్ద బుధవారం నిర్వహించిన ఆరో ప్యాకేజీ 3, 4 పంపుల వెట్ రన్ విజయవంతమైంది. ట్రయల్ రన్ విజయవంతంతో ఇంజినీరింగ్ అధికారులు స్వీట్లు పంచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆరో ప్యాకేజీలో 124 మెగావాట్స్ కలిగిన 7 భారీ మోటార్లు ఉన్నాయి. అందులో 4 పూర్తి కాగా, మిగతా మూడింటిని బిగించే ప్రక్రియ జరుగుతున్నది. పూర్తయిన 4 మోటార్లలో 1, 2 మోటర్లను గత నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రెటరీ స్మితా సబర్వాల్ ప్రారంభించారు. బుధవారం నీటి పారుదల శాఖ ఇంజినీరింగ్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్లు, సీఎంవో, ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండేతో కలిసి 3, 4 మోటార్లను ప్రారంభించారు. ఒక్కో మోటారు 3200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పాటు 105 మీటర్ల ఎత్తు వరకు ఎత్తిపోస్తోంది. ప్రయోగాత్మకంగా 15 నిమిషాల పాటు పంపును రన్ చేశారు. ఈ సందర్భంగా నల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఇదొక కీలక మైలురాయన్నారు. మిగిలిన మోటార్ల వెట్ రన్ వచ్చే నెల చివరి వరకు పూర్తి చేస్తామన్నారు. 8వ ప్యాకేజిలో వెట్రన్ నిర్వహించి మిడ్ మానేరుకు నీటి తరలిస్తామన్నారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎస్సారెస్సీకి కూడా రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలిస్తామన్నారు. ప్రస్తుతం లింక్-2తో సమానంగా శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనులు జరుగుతున్నాయన్నారు. ఈ ఖరీఫ్లో అన్ని చెరువులనూ నింపడంతో పాటు 15 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ టెక్నికల్ అడ్వైజర్ పెంటారెడ్డి, ఎస్ఈ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నూనె శ్రీధర్, నవయుగ డైరెక్టర్ రామరావు, ట్రాన్స్కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, నవయుగ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.