Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులే మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలి !
- అడ్డుకున్న మల్లన్నసాగర్ నిర్వాసితులు
నవతెలంగాణ-తొగుట
తమ భూములకు పూర్తి నష్టపరిహారం వచ్చే వరకూ ఇండ్ల కొలతలు చేపట్టొద్దని సిద్దిపేట జిల్లా తొగుట మండలం మొగిలి చెరువు తండాకు చెందిన నిర్వాసితులు అధికారుల్ని అడ్డుకున్నారు. గురువారం కొమురవెల్లి మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో అధికారులు సర్వే, ఇంటి కొలతలు చేపట్టారు. ఇదేక్రమంలో ఏటిగడ్డ కిష్టాపూర్ మధిర గ్రామం మొగిలి చెరువు తండాలో ఇంటి కొలతలు చేయడానికి అధికారులు వెళ్లగా నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ భూసేకరణకు ముందే గ్రామస్తులతో చర్చించినప్పుడు పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహారం చెల్లిస్తామని మాజీ మంత్రి హరీశ్రావు చెప్పారని గుర్తుచేశారు. భూ సేకరణ పూర్తయ్యాక ఇప్పటి వరకూ పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాకే ఇండ్ల కొలతలు తీసుకోవాలన్నారు. భూముల రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఏబీసీడీ గ్రూపులు చేసి పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులే మోసం చేస్తే మేం ఎవరికి చెప్పుకోవాలి అని వాపోయారు. తమ భూముల్లో బోర్లు, బావులు, పైపులైన్లు, పశువుల కొట్టాలు అన్నింటికీ పూర్తి పరిహారమిచ్చాకనే ఇంటి కొలతలు తీసుకోవడానికి రావాలన్నారు. దీంతో అధికారులు తండానుంచి వెళ్లి మరో మధిర గ్రామం తిరుమలగిరిలో ఇంటి కొలతలు సేకరించారు.