Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ది నియంత పాలన :పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి
నవతెలంగాణ-గజ్వేల్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకర్గంలోని కొండ పోచమ్మ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితుల పక్షాన పోరాడుతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి గురై మృతిచెందిన విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకోవాలని కోరుతూ డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆమరనిరాహార దీక్షకు దిగిన విషయం విదితమే. 14న రాత్రి నర్సారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగించిన ఆయన్ను గురువారం సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్రెడ్డి పరామర్శించారు. నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నియంతపాలన సాగిస్తున్నారని విమర్శించారు. రైతాంగ సమ స్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ప్రాజెక్టు పేరిట భూములు తీసుకుని పరిహారం ఇవ్వమని అడిగితే లాఠీచార్జీ చేయడం సిగ్గు చేటన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని నిర్వాసితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. నర్సారెడ్డి దీక్ష స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కుసుమకుమార్, గాలి అనిల్ కుమార్, నాయిని యాదగిరి, ఎల్లారెడ్డి, సర్దార్ఖాన్, రంగారెడ్డి, మల్లారెడ్డి, అజ్గర్, సమీర్, ఎక్బాల్, ముత్యాలు ఉన్నారు.