Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్టేెక్వెల్ వద్ద ఇంకిన నీరు
- 6 టీఎంసీలకు చేరిన ప్రాజెక్టు నీటి నిల్వ
నవతెలంగాణ-పెద్దపల్లి ప్రతినిధి
పెద్దపల్లి జిల్లాలో గోదారి ఎడారిని తలపిస్తోంది. నిత్యం ఎంతో కొంత నీటితో కళకళలాడే ఈ జీవనది ధర్మపురి క్షేత్రంలో అచేతనస్థితికి చేరింది. దీనిపై 20.175టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన 'ఎల్లంపల్లి' ప్రాజెక్టూ అడుగంటుతోంది. ప్రస్తుతం 6 టీఎంసీలకు నీటినిల్వ పడిపోవడంతో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల గొంతెండుతున్నది.
పెద్దపల్లి జిల్లాలో గుర్తించిన పలు ఆవాస కేంద్రాలకు అందించే భగీరథ నీటికీ ఈ ప్రాజెక్టే దిక్కు. అయితే 20.175టీఎంసీల సామర్థ్యానికిగాను ప్రస్తుతం 6టీఎంసీలే ఉండటంతో గూడెం, వేంనూర్ పథకాలకు నీరు నిలిపివేశారు. అత్యవసరంగా ఎన్టీపీసీకి 121క్యూసెక్కులు, సింగరేణికి 100 క్యూసెక్కులు అందిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఆరో ప్యాకేజీలో మోటార్ల పనితీరు పరిశీలనలో భాగంగా ట్రయల్రన్ కోసం 145 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి వెళ్లిపోయింది.
నిలిచిన మిషన్ భగీరథ
'భగీరథ' పథకానికి 2.50టీఎంసీల నీళ్లు ప్రభుత్వం కేటాయించినా.. 6 టీఎంసీల నీళ్లే ఉండటంతో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు సరఫరా నిలిపివేశారు. అసలు భగీరథకు నీళ్లు సప్లయి చేసే ఇంటెక్వెల్ వద్దనే నీరంతా ఇంకిపోవడం గమనార్హం. రెండునెలలు మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు ట్రయల్ రన్గా నీళ్లు ఇచ్చిన అధికారులు ఇప్పుడు నిలిపివేశారు. ఈ ఎండవేడిమికి రోజుకు 192 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. జంటనగరాల తాగునీటికి 327 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు వర్షాలు పడకపోతే ఉన్న నీరు ఇంకిపోయి ప్రాజెక్టు వట్టిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నది.