Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ సమస్యలు పరిష్కరించాలని నలుగురు..
- పట్టా పాస్బుక్కు కోసం తల్లీకొడుకులు..
- ధాన్యం కొనట్లేదని పురుగుల మందు తాగిన అన్నదాత
నవతెలంగాణ-రామారెడ్డి/చింతలమానెపెల్లి/కొండమల్లేపల్లి
వేర్వేరు జిల్లాల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భూ వివరాలను ఆన్లైన్ చేయకుండా పాస్బుక్కు ఇవ్వడం లేదని ఓ రైతు చెట్టుకు ఉరేసుకోబోయాడు. తన భూమిలో మట్టి తీసి పరిహారం ఇవ్వడం లేదని మరో రైతు వాటర్ ట్యాంక్ ఎక్కాడు. తమ భూమికి పట్టా పాస్ పుస్తకం ఇవ్వడం లేదనీ తహసీల్దార్ కార్యాలయంలో తల్లీకొడుకులు పురుగుల మందు తాగారు. మరోచోట ధాన్యం కొనుగోలు చేయడం లేదని మనస్తాపానికి గురై రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలు కామారెడ్డి, కుమురంభీం, నల్లగొండ జిల్లాల్లో గురువారం జరిగాయి.
కామారెడ్డి రామారెడ్డి మండలం పోసానిపేటకు చెందిన బలగం రవికి గ్రామంలో 164, 24, 29, 11 సర్వే నెంబర్లలో భూమి ఉంది. దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు వీఆర్వో లక్ష్మినరసవ్వకు అందించాడు. నెల రోజుగా ఆ ఫైల్ తహశీల్ ఆఫీసుకు వెళ్లలేదు. వెళ్లిన తర్వాత రేపుమాపు అంటూ అధికారులు నిర్లక్ష్యం చేశారు. ఈ క్రమంలో రవి తన ధాన్యాన్ని కామారెడ్డి మండలం ఇస్రాజివాడి కొనుగోలు కేంద్రంలో అమ్మాడు. ఆ ప్రాంతంలోనే తన భూమి వివరాలు ఆన్లైన్ కావడం లేదని ఓ నైలాన్తాడుతో చెట్టుకు ఉరేసుకోబోయాడు. తోటి రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ మండల రెవెన్యూ సిబ్బందితో ఫోన్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కుమురంభీంజిల్లా చింతలమానెపల్లిలోని బాబాసాగర్కు చెందిన శ్యాంరావు, అతని సోదరుడు వెంకటేష్లకు గ్రామ శివారులోని సర్వే నెంబర్ 59/బి/1, 59/1/1/1లలో నాలుగెకరాల భూమి ఉంది. రెండెకరాల చొప్పున సాగు చేసుకుంటున్నారు. అర్కగూడ ప్రాజెక్టు కుడి కాలువ కింద తలా ఎకరం భూమి ముంపునకు గురైంది. మిగిలిన రెండెకరాల్లో తలో ఎకరం ఉండాల్సి ఉండగా శ్యాంరావుకు చెందిన భూమిలో ఇరిగేషన్ అధికారులు అరెకరం కాలువ మట్టితో నింపేశారు. దానికి పరిహారం ఇవ్వకుండా తీసుకున్నారనీ, న్యాయం చేయాలనీ శ్యాంరావు అతని కొడుకు లక్ష్మినారాయణ తహసీల్దార్కు దరఖాస్తు ఇచ్చారు. స్పందించిన తహసీల్దార్ ఎంసీ చెల్లించి ఆ భూమి విస్తీర్ణం కొలతలు తీసుకోవాలని సూచించారు. మళ్లీ సదరు అధికారిని కలిసిన రైతుకు ఆ భూమిలో 50 ఏండ్ల క్రితమే రోడ్డు ఉందని సమాధానం చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మినారాయణ స్థానిక వాటర్ట్యాంక్ ఎక్కాడు. తన భూమికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఎస్ఐ లచ్చన్న బాధితుడితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ట్యాంక్ దిగాడు.
పట్టా పాసు పుస్తకం కోసం తల్లీకొడుకు..
భూమి పట్టా పాస్ పుస్తకం ఇవ్వకపోగా ఆ భూమి సంబంధిత రైతుది కాదని రెవెన్యూ అధికారులు చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు కుటుంబం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేయబోయింది. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. లింగంపల్లి తండాకు చెందిన ఖేతావత్ ఫకీర, అతని భార్య బుల్లిబాయి, కొడుకు పీర్యా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. మైలారం గ్రామ శివారులోని 366/38సర్వే నెంబర్లో ఎకరం రెండు గంటల భూమి ఉందనీ, పట్టాపాస్బుక్ ఇవ్వాలని తహసీల్దార్ అర్చనకు విన్నవించారు. తహసీల్దార్ అప్పటికే ఆ భూమి 'మీది కాదు' అని చెప్పడంతో తల్లీకొడుకు పురుగుల మందు తాగుతుండగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. వాంతులు చేసుకుని సొమ్మసిల్లి పడిపోవడంతో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాన్సువాడ ఆర్డీఓ , జాయిట్ కలెక్టర్ ఆరా తీసి.. పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులు ఆదేశించారు. తమ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు.
ధాన్యం కొనడం లేదని..
20 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఓ రైతు మనస్తాపానికి గురై ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి రైతులు తెలిపిన వివరాల ప్రకారం.... పెద్దఅడిశర్లపల్లి (పీఏపల్లి) మండలం గణపురం గ్రామానికి చెందిన తోటకూర అక్కులు 20 రోజుల క్రితం 400 బస్తాల ధాన్యాన్ని కొండమల్లేపల్లిలోని మార్కెట్యార్డ్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతు ప్రతిరోజు వేడుకుంటున్నా తేమ పేరుతో అధికారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన అక్కులు గురువారం సాయంత్రం కొనుగోలు కేంద్రంలో అధికారుల ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి రైతులు వెంటనే ఆటోలో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైతు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.