Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ ఎన్నికల బరిలో ఓ బాధిత మహిళ పోరాటం
ఛండీగఢ్ :దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రాలలో పంజాబ్ది ఓ ప్రత్యేకస్థానం. దాదాపు 96 శాతం సాగు భూమి ఉండీ.. పుట్ల కొద్దీ పంట పండే ఈ రాష్ట్రంలో రైతులు మాత్రం ఉరికొయ్యలకు వేళ్లాడుతున్నారు. వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటల దిగుబడిలో దేశంలోని తక్కిన రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నా అన్నదాతల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. ఓ సర్వే ప్రకారం రాష్ట్రంలో ప్రతిరోజు ముగ్గురు నుంచి నలుగురు రైతులు తనువు చాలిస్తున్నారంటేనే ఇక్కడ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే, సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రైతుల ఆత్మహత్యల అంశం ఏ రాజకీయ పార్టీలకూ ప్రధానాంశం కాలేదు. కానీ రుణాల భారంతో తన తండ్రి, భర్తనూ కోల్పోయిన ఓ మహిళ.. ఈ ఎన్నికలలో బాధిత రైతుల గొంతుకగా మారింది. ప్రధానంగా ఇదే అంశాన్ని స్పృశిస్తూ ప్రచారం సాగించింది. ఆమే మన్సా జిల్లాకు చెందిన వీర్పల్ కౌర్. ప్రస్తుతం బతిందా లోక్సభ అభ్యర్థిగా పోటీలో నిలిచింది. రైతుల బాధలు తనలాంటి బాధిత కుటుంబాలకే అర్థమవుతాయని.. అందుకే తాను ఎన్నికల బరిలో నిలిచినట్టు కౌర్ అంటున్నారు.
1999లో కౌర్ తనకు బంధువైన ధర్మవీర్ సింగ్ను పెండ్లి చేసుకుంది. అప్పటికే వారిద్దరి తండ్రులూ అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నారు. కాగా 2003లో ధర్మవీర్ సింగ్ సైతం రుణభారం భరించలేక తనను తానే దహనం చేసుకున్నాడు. అప్పటికీ కౌర్కు మూడేండ్ల కూతురు, ఏడాదిన్నర కొడుకు. భర్త చనిపోవడంతో ఆమె బతుకు రోడ్డున పడింది. కానీ కాలానికి ఎదురొడ్డి తన పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్న ఆమె.. ఈ ఎన్నికలలో బతిందా నుంచి పోటీలో నిలిచారు. రైతుల ఆత్మహత్యల అంశాన్ని ఏ పార్టీ పట్టించుకోవడం లేదని.. తన పోటీ ద్వారానైనా వారి గురించి ప్రపంచానికి తెలుస్తుందనే భావనతోనే ఎన్నికలలో పోటీ చేస్తున్నట్టు ఆమె తెలిపారు. కౌర్ పట్టుదలను చూసి పలువురు సామాజిక కార్యకర్తలు ఆమెకు బాసటగా నిలిచారు. నామినేషన్, ప్రచారానికి కావలసిన ఖర్చును గ్రామాలలోని కొంతమంది రైతులు, గ్రామస్తులు విరాళాల ద్వారా సేకరించి ఆమెకు సహకరించారు.
పంజాబ్లో ముఖ్యంగా మాల్వా రీజియన్లో ఉన్న ఆరు జిల్లాల నుంచే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కౌర్ సొంత జిల్లా మాన్సా నుంచే దాదాపు 3,400 మంది అన్నదాతలు అప్పుల భారంతో చనిపోవడం గమనార్హం. కాగా, దీనిపై బీజేపీ-శిరోమణి అకాళీదళ్ (ఎస్ఏడీ) గానీ కాంగ్రెస్ గానీ నోరు మెదపడం లేదు. కానీ కౌర్ మాత్రం ఏ గ్రామానికి వెళ్లినా రైతు ఆత్మహత్యల అంశాన్నే ప్రస్తావిస్తూ ఓటర్లలో చైతన్యం పెంచుతోంది. దీంతో తమ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి ఆమె చేస్తున్న కృషిని గ్రామాలలో రైతులు అభినందిస్తున్నారు. తన కొడుకు, కూతురుతో కలిసి ప్రచారం చేస్తున్న కౌర్ను అడుగడుగునా ఆదరిస్తున్నారు. ఆమెకే ఓటేస్తామని చెబుతున్నారు. ఆఖరి విడతలో భాగంగా పంజాబ్లో ఈనెల 19న ఎన్నికలు జరగనున్నాయి.
మా బాధలు ప్రపంచానికి చెప్పడానికే.. వీర్పల్కౌర్
రైతుల ఆత్మహత్యలను ఏ పార్టీ ప్రస్తావించడం లేదు. మా బాధలు వారికి తెలియవు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసమో, ఆస్తులు వెనకేసుకోవడం కోసమో రాజకీయాలలోకి వస్తున్నారు. వారందరూ ఈ కాలపు తెల్లదొరలు. ఈ ఎన్నికలలో గెలుపోటముల గురించి నేను పట్టించుకోను.