Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రుల నివాసాల ముట్టడి ఉద్రిక్తం.. తోపులాట
- కరీంనగర్లో మంత్రి కొప్పుల ఇల్లు ముట్టడి
నవతెలంగాణ-సిటీబ్యూరో/కరీంనగర్ టౌన్
ఇంటర్ బోర్డు అక్రమాల్లో దొంగలను కాపాడేందుకు సర్కారు ప్రయత్నిస్తున్నదనీ, అందుకే నిందితులను బయట పెట్టడం లేదని ఆరోపిస్తూ విద్యార్థి, యువజన సంఘాలు మంత్రుల నివాసాలను ముట్టడించాయి. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలనీ, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలనీ డిమాండ్ చేశాయి. శుక్రవారం ఎఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, పీడీఎస్యూ, టీఎన్ఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, వీజేఎస్, జనసేన విద్యార్థి, యువజన, టీఎస్యూ విద్యార్థి యుజవన సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి నిర్వహించారు. నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు గంటపాటు పోలీసులకు, విద్యార్థి నాయకుల మధ్య తొపులాట జరిగింది. అనంతరం విద్యార్థి, యువజ. నాయకులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్, జంజారాహిల్స్ పోలీసు స్టేషన్లకు తరలించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటిని ముట్టడించారు. అక్కడే ఉన్న పోలీసులకు, విద్యార్థి సంఘ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘ నాయకులను అరెస్టుచేసి పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. అదేవిధంగా సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ అనితారామచంద్రన్కు వినతి పత్రం అందజేశారు. భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించి కొత్తగూడెంలోని అమరవీరుల స్థూపం నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నాయకులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది. నాయకులను అరెస్టు చేసి 1టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట పలుసంఘాలు ధర్నా చేశాయి.