Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనుల పరిశీలన
- పనుల పురోగతిపై ఎన్టీపీసీ, జెన్కో అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-పెద్దపల్లి ప్రతినిధి/కోల్సిటీ
పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో రెండ్రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీని సందర్శించారు. శనివారం సాయంత్రం 5.20 గంటలకు రామగుండంలోని ఎన్టీపీసీ గెస్ట్హౌజ్కు చేరుకున్నారు. కేసీఆర్కు మంత్రి కొప్పుల ఈశ్వర్తోపాటు రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ దేవసేన తోపాటు ఎన్టీపీసీ, జెన్కో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ను సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016 జనవరి 29న ఈ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు గంటపాటు ప్లాంట్లోని నిర్మాణ పనులను ప్రతి విభాగాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులతో చర్చిస్తూ తెలుసుకున్నారు. అధికారులు కూడా చిత్ర పటాలతోపాటు ప్రత్యక్షంగా చూపిస్తూ వివరించారు. సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ, తెలంగాణ ట్రాన్స్కో సీఎమ్డీ ప్రభాకర్రావు, సింగరేణి సీఎమ్డీ శ్రీధర్, సీఎం సలహాదారు రాజీవ్శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎన్టీపీసీ ఈడీ ఉన్నారు.
పరిశీలన అనంతరం ఎన్టీపీసీ గెస్ట్హౌజ్లోకి చేరుకున్న కేసీఆర్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొన్నారు. తర్వాత సాయంత్రం 7 గంటలకు మీటింగ్హల్లో ఎన్టీపీసీ, జెన్కో అధికారులతో గంటపాటు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్ ప్లాంట్ పనుల పురోగతిపై గంటసేపు అధికారులతో సమీక్షించారు.
నేడు కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణ పనుల పరిశీలన
పర్యటనలో భాగంగా రెండోరోజు ఆదివారం సీఎం భూపాలపల్లి జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఉదయం 6.40గంటలకు ఎన్టీపీసీ గెస్ట్హౌజ్ నుండి బయలుదేరి కన్నెపల్లి పంపుహౌజ్ పనులు పరిశీలించిన తర్వాత ఉదయం 7.20 గంటలకు మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ముక్తిశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడే నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ పనులను పరిశీలించి అధికారులతో చర్చించి, మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి మళ్లీ రామగుండంలోని ఎన్టీపీసీకి చేరుకోనున్నారు. ఎన్టీపీపీలోనే మధ్యాహ్నం భోజనం చేసి అక్కడి నుండి నేరుగా హెలీక్యాప్టర్లో హైదరాబాద్కు వెళ్తారు.
ప్రజాసంఘాల నాయకుల ముందస్తు అరెస్ట్
రామగుండం నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా సీపీఐ అనుబంధ విద్యార్థి, కార్మిక సంఘ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. పోలీసులు ఇంటికెళ్లి మరీ అరెస్టులు చేశారు. సీపీఐ అనుబంధ సంఘాల నాయకులను అరెస్టు చేయడానికి అక్రమ అరెస్టులపై స్పందించిన సీపీఐ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్ తీవ్రంగా ఖండించారు. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకునే నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. అరెస్టు చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టైన వారిలో సీపీఐ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్, నగర కార్యదర్శి గోషిక మోహన్, కడారీ సునీల్, ఏఐవైఎఫ్ నాయకులు మద్దెల దినేష్, కందుకూరి రాజరత్నం, కనకరాజ్, ప్రకాష్, కరీం, లెనిన్, అశోక్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఈర్ల రాంచంద్ర, ఏఐటీయూసీ నాయకులు శనిగరపు చంద్రశేఖర్, శనిగల శ్రీనివాస్ ఉన్నారు.