Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభయారణ్యాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనతోనే సాధ్యం
- వాలంటీర్లకు ప్రశంసాపత్రాల అందజేత కార్యక్రమంలో పీసీసీఎఫ్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ అడవుల పునరుజ్జీవనం వేగంగా జరుగుతున్నదని, దాదాపు కనుమరుగైన కొన్ని జంతువులు (పులులు, అడవి దున్నలు, ఇతర జంతువులు) ఇప్పడు ఎక్కువ సంఖ్యలో పెరిగాయని, అడవులు-వన్యప్రాణుల రక్షణ చర్యలు కొనసాగించటంతోనే అది సాధ్యమవుతున్నదని పీసీసీఎఫ్ ఎం.పృధ్వీరాజ్, ఆర్.శోభ అన్నారు. పులిని చూడాలంటే పక్క రాష్ట్రాల్లో అడవులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తెలంగాణలోనే కవ్వాల్, అమ్రాబాద్ అభయారణ్యాలకు వెళితే చాలు అనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ ప్రోత్సాహంతో అడవుల పునరుజ్జీవనం, వన్యప్రాణుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈనెల 11, 12 ల్లో కవ్వాల్, అమ్రాబాద్, ఏటూరునాగారం రక్షిత అటవీ ప్రాంతాల్లో నీటి సౌకర్యాల లభ్యత, జంతువుల సంచారంపై రెండ్రోజుల పాటు సర్వే జరిగింది. సర్వేలో పాల్గొన్న జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లతో అరణ్యభవన్లో అటవీ శాఖ ఉన్నతాధికారుల సమావేశం శనివారం నిర్వహించారు. వాలంటీర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. సర్వేలో పాల్గొన్న వారందరికీ అటవీ శాఖ తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వాలంటీర్లు మాట్లాడుతూ..సహజ నీటి కుంటల రక్షణతో పాటు, కృత్రిమంగా ఏర్పాటు చేసిన సాసర్ ప్లేట్లు మండు వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నాయన్నారు. ప్రతి మూడు నెలలకోసారి అటవీ శాఖ వివిధ అంశాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తే తాము పాల్గొంటామని సంసిద్ధత వ్యక్తం చేశారు. సమావేశంలో అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, ఓఎస్డీ శంకరన్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ, దక్కన్ బర్డ్ వాచర్స్, వరల్డ్ వైడ్ ఫండ్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ తరపున వాలంటీర్లు పాల్గొన్నారు.